ముషీరాబాద్, నవంబర్ 30: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీఎస్ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లోని విద్యానగర్లోగల టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘చలో ఢిల్లీ-మాదిగ, మాదిగ ఉపకులాల లొల్లి’ పేరిట రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. 27 ఏండ్లుగా వర్గీకరణ ఉద్యమం సాగుతున్నా, ఎందరో మాదిగ బిడ్డలు ప్రాణత్యాగం చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మనసు కరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడమే లక్ష్యంగా డిసెంబర్ 13న మాదిగలు, మాదిగ ఉపకులాల గొంతు వినిపించడానికి చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. మాదిగలు, మాదిగ ఉపకులాల వారు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.