ఐఐటీలో సీటొస్తే భారీ ప్యాకేజీ ఖాయమని ఫిక్సయిపోతారు. కానీ, ఆమె మాత్రం జీవితంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఇండియాలో ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్ నడిపింది. లండన్లో ఫిన్ టెక్ కంపెనీ నిర్వహించింది. ఆడవాళ్ల ఉనికి అంతంతమాత్రమే ఉండే యంత్రాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. సంతోషి బుద్ధిరాజు వ్యాపార జీవితంలో ఇలాంటి మలుపులు అనేకం. అవన్నీ ఆమె మాటల్లోనే..
నేను పుట్టింది హైదరాబాద్లో. పెరిగింది చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో. చుట్టూ పారిశ్రామిక వాడలే. దీంతో యంత్రాలంటే ఆసక్తి ఏర్పడింది. లోహాలను కరిగించడం నుంచి వాటితో యంత్రాలు చేయడం వరకు ప్రతి దశా ప్రత్యక్షంగా చూశాను. మా మామయ్య ఎన్ఎఫ్సీలో పనిచేసేవారు. లోహ విజ్ఞానశాస్త్రం గురించి, ఆ రంగంలో అవకాశాల గురించీ చెప్పి ప్రోత్సహించారు. దీంతో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదవాలనుకున్నాను. ఐఐటీ (బీహెచ్యూ)లో సీటు రావడంతో మరో ఆలోచన లేకుండా చేరిపోయాను.
డెలివరీ అంకుల్
మెటలర్జీ బ్రాంచ్లో అమ్మాయిలు అరుదు. ఉన్న ఒకరిద్దరు కూడా పట్టా చేతికొచ్చాక, కంప్యూటర్ కోర్సులు చేసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీకో వెళ్తారు. నేనూ అంతే. ఎడ్యుకేషన్ లోన్ తీర్చాలి. నాన్న చిన్న ఉద్యోగి. కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనే ఉద్దేశంతో ఒక కన్సల్టింగ్ కంపెనీలో చేరాను. అక్కడే బిజినెస్ ఎనలిటిక్స్ నేర్చుకున్నాను. ఏడాదిన్నర తర్వాత, ఆ అనుభవంతో ‘డెలివరీ అంకుల్’ స్థాపించాను. ఈ ఆలోచన నా స్వానుభవంలోంచి పుట్టింది. బెనారస్లో చదివే రోజుల్లో.. హైదరాబాద్కు రావాలంటే 26 గంటల ప్రయాణం. రైల్వే ఫుడ్ నచ్చకపోయేది. ప్రయాణికులకు ఆ ఇబ్బంది రాకుండా.. కోరుకున్న ఆహారం సకాలంలో సమకూర్చే ‘రైల్వే అంకుల్’ అనే స్టార్టప్ ప్రారంభించాను. ప్రయాణికులు ఫోన్ చేసి, పీఎన్ఆర్ నంబర్, ట్రైన్ వివరాలు చెబితే.. ఫోన్లో ఆర్డర్ తీసుకుని లంచ్ టైమ్కి ఆహారం అందించేవాళ్లం.
నాణ్యతలో రాజీ లేకుండా.. 95 నగరాల్లోని పేరున్న హోటల్స్తో ఒప్పందం చేసుకున్నాం. అడిగిన ఫుడ్ చెప్పిన సమయానికి డెలివరీ చేశాం. రెస్పాన్స్ బాగా వచ్చింది. కానీ, మా ‘రైల్వే అంకుల్’ వచ్చిన మూడేండ్ల తర్వాత ఐఆర్సీటీసీ కూడా ఇలాంటి సేవలనే మొదలుపెట్టింది. రైల్వే శాఖ కొత్త నిబంధనలతో మాకు ఇబ్బందులు వచ్చాయి. మా సేవలు ఆపాల్సి వచ్చింది. ఆ తర్వాత హెచ్ఎస్బీసీ ఫైనాన్స్ కంపెనీలో డేటా అండ్ ఎనలిటిక్స్ సీనియర్ మేనేజర్గా చేరాను. నాలుగున్నరేండ్లు పని చేశాను. తర్వాత, మరో ముగ్గురితో కలిసి లండన్ కేంద్రంగా ‘మార్ట్గేజ్ కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఫిన్ టెక్ కంపెనీ స్టార్ట్ చేశాను.
తవ్వినకొద్దీ లాభం..
కొవిడ్ తర్వాత హైదారాబాద్కు వచ్చేశాను. ఆ సమయంలో కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పైప్లైన్, కేబుల్ వర్క్స్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆ పనుల కోసం నాణ్యమైన యంత్రాలు లేవని అర్థమైపోయింది. మనమే తయారు చేస్తే మంచి లాభాలొస్తాయని మిత్రుడు లక్ష్మణ్ వల్లకాటి, నేను అనుకున్నాం. రెండేండ్ల క్రితం రూ. నాలుగు కోట్ల పెట్టుబడితో ఆటోక్రసీ మెషినరీ కంపెనీని స్థాపించాం. సాధారణ ఎక్స్కవేటర్ ఒక రోజులో చేసే పనిని మా యంత్రం గంటలో పూర్తి చేస్తుంది. వాటర్ పైప్లైన్, కేబుల్ లైన్స్, కాలువల తవ్వకం కోసం కూడా మెషినరీ రూపొందించాం. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. వివిధ పంటలకు అవసరమైన యంత్రాలూ ఉన్నాయి. రుద్ర, గజ, అనంత, వారాహి, మయూర.. తదితర పేర్లతో వాటిని విక్రయిస్తున్నాం. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. ధైర్యంగా అడుగు ముందుకేస్తే.. మహిళ సాధించలేనిదంటూ లేదు. కుటుంబ ప్రోత్సాహమూ తోడైతే తిరుగు ఉండదు.
నా బలం.. అమ్మ
యంత్రాల తయారీ రంగంలో ఆడవాళ్లు కనిపించరు. మా అమ్మ, నాన్న మద్దతు వల్లే నేను రాగలిగాను. ఆటోక్రసీ విజయంతో మా కుటుంబంతోపాటు కంపెనీ భాగస్వామి లక్ష్మణ్ కూడా సంతోషంగా ఉన్నారు. నా జీవితంలోని ప్రతి మలుపులో మా అమ్మ ఉన్నారు. ఆడపిల్లను చదివించాలి, పెండ్లి చేయాలనే ఆలోచనకే పరిమితం కాకుండా.. నువ్వు బయటికి వెళ్లాలి, అనుకున్నది సాధించాలి అని నూరిపోసింది. కాబట్టే, ‘ఆడపిల్లను కాబట్టి, ఫలానా పని నేను చేయలేను’ అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.
– నాగవర్ధన్ రాయల