బాలీవుడ్క్ కరోనా వైరస్ పట్టుకున్నది. ఇప్పటికే పలువురు నటులు కరోనాకు గురై దవాఖాన పాలవగా.. ఇవాళ ఉదయం నటుడు రణ్బీర్ కపూర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా, దర్శకుడు, నిర్మాత సంజయ్లీలా భన్సాలీకి కూడా కరోనా పాజిటివ్గా నివేదికలు వచ్చాయి. మరో నటి ఆలియా భట్ ముందస్తుగా క్వారంటైన్లో ఉండిపోయారు.
చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని అతడి తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇలాఉండగా, దర్శక నిర్మాత అయిన సంజయ్లీలా భన్సాలీకి కూడా కరోనా పాజిటీవ్గా తేలిందంట. భన్సాలికి కరోనా పాజిటివ్గా నివేదిక రావడంతో ముందస్తు జాగ్రత్తగా భన్సాలీ సినిమా ‘గంగూబాయి కథియావాడి’లో నటిస్తున్న అలియాభట్ కూడా క్వారంటైన్లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నది. రణ్బీర్ ప్రస్తుతం నటిస్తున్న ‘బ్రహ్మాస్త్రా’ లో అలియా భట్, నాగార్జున కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు సంజయ్లీలా భన్సాలీకి కరోనా రావడంతో ‘గంగూబాయి కథియావాడి’ సినిమా నిర్మాణం పనులు నిలిచిపోయాయి. అయితే అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇలాఉండగా, భన్సాలీ తల్లి లీలా భన్సాలీ మాత్రం ఆరోగ్యంగానే ఉన్నట్లు వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. తనకు కొవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ రాగానే వెంటనే తన తల్లికి కూడా పరీక్షలు చేయించగా.. ఆమెకు నెగెటివ్గా తేలిందని, అయితే, ముందస్తుగా ఆమె కూడా క్వారంటైన్లో ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.