మెల్బోర్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్కు వీడ్కోలు పలుకనుంది. ఈ సీజన్ అనంతరం తన ఆటకు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు 35 ఏండ్ల సానియా మీర్జా పేర్కొంది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సానియా.. బుధవారం తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించింది. మహిళల డబుల్స్లో సానియా మీర్జా-నదియా కిచనోక్ జోడీ మెల్బోర్న్లో తొలి రౌండ్లోనే స్లొవేనియా జంట చేతిలో ఓటమి పాలైంది. భారత్ తరఫున మహిళల సింగిల్స్లో 27వ ర్యాంక్కు చేరిన సానియా.. అత్యుత్తమ ప్రదర్శనతో కెరీర్లో ఆరు గ్రాండ్స్లామ్ ట్రోఫీలు కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం సానియా మాట్లాడుతూ.. ‘దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నా కుమారుడు ఇజ్హాన్కు ఇప్పుడు మూడేండ్లు.. అతడిని వెంట పెట్టుకొని కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రయాణాలు చేయడం తగదనిపిస్తున్నది. మాతృత్వ అనుభూతిని పొందిన అనంతరం మహిళలకు ఆదర్శంగా నిలువాలనే ఉద్దేశంతోనే తిరిగి గ్రౌండ్లో అడుగు పెట్టా.. దానికోసం తీవ్రంగా శ్రమించి బరువు తగ్గా. ప్రస్తుతం నా వయసు 35. ఇప్పటికే మోకాలి నొప్పి ఇబ్బంది పెడుతున్నది. దీనికి తోడు మణికట్టు గాయం తిరగబెట్టింది. వీటి వల్లే ఓడిపోయానని చెప్పడం లేదు. కానీ.. ఇది కూడా ఒక కారణమే. ఈ దశలో తిరిగి కోలుకోవడం కష్టం అనిపిస్తున్నది. అందుకే ఈ సీజన్ తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతున్నా. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇదే నా చివరి మ్యాచ్. వచ్చే ఏడాది వరకు ఆడలేను’ అని వివరించింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-నదియా జంట 4-6, 6-7 (5/7) జువన్-జిడాన్సెక్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది.