Sandeep Reddy | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ఏప్రిల్ 7న విడుదల కానుందని ప్రచారం జరుగుతుండటంతో.. ఈ రెండు భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీపై ఆసక్తికర చర్చ మొదలైంది.
‘రోమాంచకం’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’, ‘వారణాసి’ విడుదల మధ్య ఉన్న గ్యాప్ గురించి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారణాసి’ సినిమా ‘స్పిరిట్’ కంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. రెండు సినిమాల విడుదలల మధ్య సుమారు 37 రోజుల సమయం ఉంది. నెల రోజులకు పైగా గ్యాప్ ఉండటంతో పెద్దగా ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నాం అని తెలిపారు.అంతేకాదు, ‘అవసరమైతే వారణాసి సినిమా కోసం మా విడుదల తేదీ విషయంలో వెనక్కి తగ్గడానికి కూడా సిద్ధంగా ఉంటాం’ అంటూ సందీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘స్పిరిట్’ షూటింగ్కు సంబంధించి కూడా సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్ ఇచ్చారు. సినిమా చిత్రీకరణలో ఇంకా సుమారు 65 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ను పూర్తి చేసి.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రభాస్ కెరీర్లో అత్యంత పవర్ఫుల్ పాత్రల్లో ఒకటిగా నిలవనున్న ఈ సినిమాలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ రా అండ్ ఇంటెన్స్ ట్రీట్మెంట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సెన్సార్ సర్టిఫికేషన్పై కూడా సందీప్ వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గత చిత్రాలకు ‘A’ సర్టిఫికెట్ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘స్పిరిట్’కు కూడా అదే తరహా సర్టిఫికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ సినిమా కథ, యాక్షన్, ఎమోషన్స్ మరింత ఇంటెన్స్గా ఉండబోతున్నాయనే అంచనాలు అభిమానుల్లో పెరిగాయి. మొత్తానికి 2027లో ‘స్పిరిట్’, ‘వారణాసి’ వంటి రెండు అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రాలు తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో భారతీయ సినీ పరిశ్రమలో భారీ ఉత్సాహం నెలకొంది.