‘తీవ్రమైన భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథా చిత్రం చూసి చాలా రోజులైంది. ఈ సినిమా ఆ లోటును తీర్చుతుంది. ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయా. ప్రీమియర్ షో చూసిన చాలా మంది దర్శకులు, నటులు ఇదే మాట చెప్పారు’ అని అన్నారు పూరి జగన్నాథ్. ఆయన కథ, మాటల్ని అందిస్తూ తనయుడు ఆకాష్ హీరోగా రూపొందించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకుడు. నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రేమ కన్నా మోహం గొప్పది. మోహం నుంచే ప్రేమ పుడుతుంది. ఈ పాయింట్ సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. ఇదొక ఇడియట్లాంటి సినిమా అని అందరు చెబుతున్నారు. ఆకాష్ ప్రతిభావంతుడైన నటుడు. కానీ రొమాన్స్లో కొంచెం వీక్. వాడు ఇంకా బాగా చేస్తాను అంటే నేను బాగా రాయడానికి సిద్ధంగా ఉన్నా. ఆకాష్ నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు.
ఈ సినిమా విషయంలో ప్రభాస్, విజయ్ దేవరకొండ మంచి మద్దతునిచ్చారు’ అని చెప్పారు. తమ టీమ్ అందరికి ఎంతో ముఖ్యమైన సినిమా ఇదని, ప్రివ్యూ చూసిన వారందరూ ప్రశంసించడం ఉత్సాహాన్నిచ్చిందని ఛార్మి చెప్పింది. ఆకాష్పూరి మాట్లాడుతూ ‘నాన్నకు మంచి హిట్ ఇవ్వాలన్నదే నా లక్ష్యం. అందుకే బాగా శ్రమించాను. చంటిగాడు, పండుగాడిలా..ఈ సినిమాలో నేను పోషించిన వాస్కోడిగామా పాత్ర గుర్తుండిపోతుంది’ అని చెప్పారు. ‘గోవాలో ఇప్పటివరకు చూడని లొకేషన్స్ను ఇందులో చూపించాం. ఆకాష్ తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాడు’ అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.