కర్రలతో సిబ్బందిపై దాడి.. నగదు అపహరణ
చెడ్డీలు, మంకీ క్యాపులు ధరించి వచ్చిన దుండగులు
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
ధర్పల్లి, డిసెంబర్ 29 : మండల కేంద్రంలోని కమాన్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోకి దుండగులు చొరబడి సిబ్బందిపై కర్రలతో దాడి చేసి నగదును దోచుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన సమయం, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 8 గంటల 8 నిమిషాలకు సుమారు పది మంది దుండగులు పెట్రోల్ బంక్ వెనుక వైపు నుంచి వచ్చి బంక్లో కుర్చీల్లో కూర్చున్న సిబ్బందిపై రాళ్లతో దాడి చేయ డం ప్రారంభించారు. ఒక్కసారిగా దుండగులు దాడి చేయడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దుండగులు ముఖం కనిపించకుండా మంకీ క్యాప్లు ధరించారు. కొంతమంది బయట కాపలా ఉండగా ఇద్దరు కర్రలతో బంక్ లోపలికి ప్రవేశించారు. అక్కడే ఉన్న రాందాస్ అనే వర్కర్ను కర్రలతో చితకబాదుతూ బయటికి వెళ్లాలని బెదిరించారని బాధితుడు తెలిపాడు. వారు తెలుగులోనే మాట్లాడారని పోలీసులకు వివరించాడు. లోపలికి వచ్చిన ఇద్దరు దుండగులు కౌంటర్ టేబుల్ బయటికి లాగి, లోపల ఉన్న బీరువాను పగులగొట్టారు. దొరికిన కాడికి దోచుకున్నారు. టేబుల్ను బంక్ వెనుకవైపు ఉన్న పొలాల్లో పడేశారు. అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. తొందరలో సుమారు రూ.21 వేల వరకు నగదు అందులోనే ఉండిపోయింది. భయంతో కమాన్ వరకు పరుగులు తీసిన బంక్ సిబ్బంది.. పోలీసులకు, బంక్ యజమాని నర్సాగౌడ్కు సమాచారం అందించారు. ధర్పల్లి సీఐ శ్రీశైలం, పోలీసు సిబ్బందిని వెంట బెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకుని దొంగల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. నిజామాబాద్ ఏసీసీ వెంకటేశ్వర్ బంక్కు చేరుకుని వివరాలను సేకరించారు. మొత్తం ఎంత నగదు ఎత్తుకెళ్లారనే విషయం తేలాల్సి ఉంది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ…
సీపీ కే.ఆర్ నాగరాజు సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది, బంక్ యజమాని నుంచి వివరాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ తెప్పించి తనిఖీలు చేపట్టారు.
కారం కొట్టి డబ్బులు కాజేసిన ఘటన మరువక ముందే..
ఈ నెల 16న ధర్పల్లిలో బీసీ పాయింట్ నడుపుకొనే సవిత అనే మహిళ కంట్లో కారం కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మరువకముందే దొంగలు పెట్రోల్ బంక్పై దాడి చేసి దొంగలు పోలీసులకు సవాల్ విసిరారు. ఆ కేసులో సైతం దొంగలని పోలీసులు ఇంత వరకు పట్టుకోలేక పోయారు. ఇప్పుడు ఈ సంఘటనతో మండల ప్రజలు తీవ్ర భయాందోళననకు గురవుతున్నారు.