పొట్టి క్రికెట్లో దంచికొట్టే రిషబ్ పంత్.. టెస్టుల్లోనూ అరుదైన ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగు దశాబ్దాల క్రితం దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ టెస్టు ఫిప్టీ రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. స్వదేశంలో తొలిసారి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్న బుమ్రా.. లంకేయులను తొలి ఇన్నింగ్స్లో చుట్టేస్తే.. ధనాధన్ షాట్లతో పంత్ వారిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, హనుమ విహారి కూడా తమ వంతు పాత్ర పోషించడంతో లంక ముందు కొండంత లక్ష్యం నిలిచింది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో టీమ్ఇండియా విజయం ఖాయం కాగా.. లంకేయులు ఎంత వరకు పోరాడుతారనేది ఆసక్తికరం!
బెంగళూరు: సొంతగడ్డపై ఎదురులేకుండా సాగుతున్న టీమ్ఇండియా.. శ్రీలంకతో రెండో టెస్టులో విజయానికి చేరువైంది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై భారత ఆటగాళ్లు పట్టుదల కనబర్చడంతో రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన రోహిత్ సేన.. వరుసగా రెండో టెస్టులో లంకను చిత్తు చేసేందుకు సిద్ధమైంది. ఓవర్నైట్ స్కోరు 86/6తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 109 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (43) టాప్ స్కోరర్ కాగా.. బుమ్రా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే ప్రపంచ అత్యుత్తమ పేసర్గా పేరుతెచ్చుకున్న బుమ్రాకు.. స్వదేశంలో ఇదే తొలి ఐదు వికెట్ల ఫీట్ కావడం గమనార్హం. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా.. 303/9 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (46), మయాంక్ అగర్వాల్ (22) మెరుగైన ఆరంభాన్నివ్వగా.. శ్రేయస్ అయ్యర్ (67; 9 ఫోర్లు), రిషబ్ పంత్ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. ముఖ్యంగా పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతి ఎక్కడేసినా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నట్లు దంచికొట్టాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని 40 ఏండ్ల నుంచి భారత్ తరఫున కపిల్ దేవ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ టెస్టు ఫిఫ్టీ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ శతకం కోసం రెండేండ్లుగా ఎదురు చూస్తున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (13) రెండో ఇన్నింగ్స్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. ప్రవీణ్ జయవిక్రమ బంతికి వికెట్ల ముందు దొరికిపోయి నిరాశగా వెనుదిరిగాడు. లంక బౌలర్లలో ప్రవీణ్ 4, లసిత్ ఎంబుల్దెనియా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 447 పరుగుల లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన లంక ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. లహిరు తిరుమనె (0) ఖాతా తెరవకుండానే బుమ్రాకు చిక్కగా.. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (10), కుషాల్ మెండిస్ (16) క్రీజులో ఉన్నారు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న మ్యాచ్లో లంకేయులు లక్ష్యానికి 419 పరుగుల దూరంలో ఉన్నారు. అద్భుతం జరిగితే తప్పా.. మ్యాచ్ మంగళవారానికి వెళ్లకపోవచ్చు.
టీ20 తరహా బ్యాటింగ్తో లంకేయులను ఊచకోత కోసిన రిషబ్ పంత్.. నాలుగు దశాబ్దాల క్రితం దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డు బద్దలు కొట్టాడు. 1982లో పాకిస్థాన్తో మ్యాచ్లో కపిల్ పాజీ 30 బంతుల్లో అర్ధశతకం నమోదు చేయగా.. తాజా మ్యాచ్లో పంత్ 28 బంతుల్లో ఫిఫ్టీ కొట్టాడు. దీంతో పాటు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఓ వికెట్ కీపర్ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన అర్ధశతకం ఇదే కావడం విశేషం. అరుదైన ఫీట్ నమోదు చేసిన పంత్ను బీసీసీఐ అభినందించింది.
రసవత్తరంగా సాగుతున్న భారత్, శ్రీలంక రెండో టెస్టులో ‘సెల్ఫీ’ కోసం ముగ్గురు యువకులు సాహసం చేశారు. ఆదివారం శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ముగ్గురు అభిమానులు స్టేడియంలోకి దూసుకొచ్చారు. పోలీసుల కళ్లు గప్పి వచ్చిన యువకులు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగారు. ఈ హఠాత్పరిణామానికి ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది వెంటనే స్టేడియంలోకి వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెండు నిమిషాల పాటు మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 252 (శ్రేయస్ అయ్యర్ 92, పంత్ 39; ప్రవీణ్ 3/81), శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ (మాథ్యూస్ 43; బుమ్రా 5/24, షమీ 2/18), భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్ (శ్రేయస్ 67, పంత్ 50, రోహిత్ 46; ప్రవీణ్ 4/78, లసిత్ ఎంబుల్దెనియా 3/87), శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 7 ఓవర్లలో 28/1 (కుషాల్ 16 నాటౌట్; బుమ్రా 1/9).