యాచారం, ఫిబ్రవరి 13 : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ సూచించారు. మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, కందుకూరు మండలాల ఈజీఎస్ అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల్లో కొనసాగుతున్న పనులు, తయారు చేసిన ప్రణాళికలను ఆయన ఏపీవోలను అడిగి తెలుసుకున్నారు. మండలాలవారీగా ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులను అన్ని మండలాల్లో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా కూలీల సంఖ్యను పెంపొందించి ప్రతి కూలీకి పని కల్పించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఈజీఎస్ కింద చేపట్టే పనులపై సమగ్ర ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేయాలని ఆయన సూచించారు. ఉపాధి పనులకు సంబంధించి, కూలీలకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధి పనుల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ చేయాలన్నారు. ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మండలాల్లో ఏపీవోలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎంపీడీవోలు ఈజీఎస్ పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీసి సక్రమంగా నిర్వహించేలా చూడాలన్నారు. ప్రతి రోజూ లేబర్ రిపోర్టు తయారుచేసి నివేదిక అందజేయాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఏపీవోలు లింగయ్య, లలిత, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.