హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపార రంగం జోరుగా పరుగులు తీస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండటం, అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతుండటం, తుపానులు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం లేని భౌగోళిక సానుకూలతలు ఇందుకు ముఖ్య కారణం. ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్ ఆవల సుమారు 30 కి.మీ. దూరంలో హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) రియల్టర్లను విశేషంగా ఆకర్షిస్తున్నది. వివిధ సంస్కృతులకు నెలవై మినీ భారత్గా భాసిల్లుతున్న హైదరాబాద్లో ఆర్ఆర్ఆర్ ఏర్పాటు పూర్తయితే నగరం నలుమూలలా మరింత విస్తరించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఈ రోడ్డులోని ఉత్తర భాగానికి సంబంధించిన తుది అలైన్మెంట్తోపాటు పూర్తిస్థాయి డీపీఆర్ తయారవుతున్నది. మరోవైపు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్పై ప్రత్యేకంగా కేంద్రీకరించి ఎక్కడా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా వ్యూహాత్మక రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐపాస్ను, భవన నిర్మాణాలకు వేగంగా అనుమతులిచ్చేందుకు టీఎస్బీపాస్ను తీసుకురావడంతో హైదరాబాద్ దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
భూముల ధరలపై ఆరా
ఎన్నో సానుకూలతలున్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం సురక్షితమని దేశ, విదేశీ స్థిరాస్తి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డీఎల్ఎఫ్, మంత్రి డెవలపర్స్, మహీంద్రా, బిగ్రేడ్ లాంటి మేటి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. కొత్తూరు సమీపంలో డీఎల్ఎఫ్ వెంచర్ను ఆరంభించగా.. ముంబైకి చెందిన హీరానందానీ సంస్థ భానూరు వద్ద లహరి రిసార్ట్స్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నది. మరికొన్ని సంస్థలు ఆర్ఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెంచర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గుర్గావ్ (హర్యానా), నోయిడా (ఉత్తరప్రదేశ్)కు చెందిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్ఆర్ఆర్ మొదటి దశ నిర్మాణం జరిగే సంగారెడ్డి, కంది, శంషాబాద్ ప్రాంతాల్లో భూములు, వాటి ధరల గురించి విస్తృతంగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా..
దేశంలో హైదరాబాద్ మినహా మరే నగరానికీ మూడు రింగ్ రోడ్డులు లేవు. అతిపెద్ద రిం గ్ రోడ్ కూడా హైదరాబాద్లోనే ఉన్నది. హైదరాబాద్ అభివృద్ధిలో ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారత దేశానికి ప్రధాన లింకులు ఇవే. బెంగుళూరు-నాగపూర్ హైవే, ముంబై-విజయవాడ హైవే లు హైదరాబాద్ మీదుగానే ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడటంతో రియల్టర్లు హైదరాబాద్కు పరుగులు తీస్తున్నారు. ఔటర్, ఆర్ఆర్ఆర్కు మధ్య ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అలైన్మెంట్ ఖరారు!
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించిన అలైన్మెంట్ ఖరారైనట్టు తెలిసింది. ఢిల్లీలో సోమవారం జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గతంలో అలైన్మెంట్ కోసం నాగపూర్కు చెందిన ఓ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. ఆ సంస్థ నాలుగు ప్రతిపాదనలు సమర్పించగా.. వాటిని పరిశీలించిన జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఒక అలైన్మెంట్ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నెలాఖరున విడుదల కానున్నట్టు సమాచారం.
సురక్షితమైన నగరం
హైదరాబాద్ అన్ని రకాలుగా సురక్షితమైన నగరం. వాతావరణ రీత్యా దేశంలో ఏ నగరానికి లేనన్ని అనుకూలతలు హైదరాబాద్కే ఉన్నాయి. అందుకే ఎంతో మంది ఉత్తర భారతీయులు ఇక్కడ స్థిరపడ్డారు. కోకాపేట, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేవారిలో ఉత్తర భారతీయులే ఎక్కువ. ఈ నేపథ్యంలో చాలా మంది రియల్టర్లు ముంబై-బెంగళూరు హైవేకి చేరువగా ఉండే చేవెళ్ల, శంకర్పల్లి, కంది తదితర ప్రాంతాల్లో భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకి చెందిన హిరానందానీ, కల్పతరురు లాంటి సంస్థలు ఇక్కడ నిర్మాణాలు సాగిస్తున్నాయి.
హైదరాబాద్లో మోసం ఉండదు
హైదరాబాద్ వాసులు ఇచ్చి న మాటకు కట్టుబడి ఉంటారు. ఎవరినీ మోసగించరు. ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. జీవన వ్యయం, భూముల ధరలు చాలా తక్కువ. శాంతిభద్రతలకూ ఎలాంటి ఢోకా లేదు. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్కు వచ్చిన వారిలో అత్యధికులు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ముగిశాక స్థిరాస్తి కొనుగోళ్లు మరింత పెరిగాయి.
అందుబాటు ధరల్లో భూములు
భూముల ధర లు అందుబాటులో ఉండ టం, సత్వర అనుమతుల కోసం ప్రభు త్వం ప్రత్యేక పాలసీలు తీసుకురావడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి సా నుకూల వాతావరణం ఏర్పడింది. దీం తో ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చని దేశంలోని ఎంతో మంది రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అనుభవంలేని కొంత మంది వ్యాపారులు అనుమతులు, భవన నిర్మాణ ప్ర ణాళికలు లేకుండా ఇండ్లను నిర్మిం చి ప్రీలాంచిగ్ ఆఫర్ల పేరుతో తక్కు వ ధర కు అమ్ముతున్నారు. దీంతో హైదరాబాద్కు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇలాంటివారిని ప్రభుత్వమే అరికట్టాలి.