జైపూర్: ప్రసవానికి ఆరు గంటల ముందు ఒక మహిళ అంబులెన్స్లో పరీక్ష రాసింది. అనంతరం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యి మరునాడు జరిగిన పరీక్ష కూడా రాసింది. రాజస్థాన్లోని ఝుంఝునూ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిరి గ్రామానికి చెందిన లక్ష్మీ కుమారి, జేఎం బీఈడీ కాలేజీలో బీఈడీ చదువుతోంది. నిండు గర్భిణీ అయిన ఆమె మంగళవారం మధ్యాహ్నం సూరత్గఢ్ సీహెచ్సీలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే దీనికి ముందు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అంబులెన్స్లో పరీక్ష రాసింది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా పురిటి నొప్పులను లక్ష్మీ లెక్కచేయలేదు. రాత్రి వేళ హాస్పిటల్లో ప్రిపేర్ అయ్యింది. బుధవారం కూడా అంబులెన్స్లో పడుకుని మరో పరీక్ష రాసింది. ఆమె భర్త శ్యామ్లాల్ మీనా దీని కోసం పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రవిశర్మతో మాట్లాడి అనుమతి పొందారు.
కాగా, లక్ష్మీతోపాటు మరో ఇద్దరు సూపర్ మామ్లు సోను శర్మ, సరిత కూడా ఈ కేంద్రంలో పరీక్షలు రాశారు. నాలుగు రోజుల కిందట సోను ఒక శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం పరీక్ష రాసిన ఆమెకు కేంద్రంలో ఒక బెడ్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం సరిత కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె కూడా కారులో కూర్చొని పరీక్ష రాసింది.
అయితే ప్రసవ బాధలు భరిస్తూ జీవితంలో ముఖ్యమైన సమయంలో కూడా పరీక్షలకు హాజరైన ఈ మహిళలను పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రవిశర్మ అభినందించారు. పరీక్షల పట్ల అంకిత భావానికి వారికి నమస్కరిస్తున్నానని అన్నారు.