పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
బ్రహ్మకడిగిన పాదాలకు..
ముప్పైరెండువేల మేలిమి ముత్యాలతో శ్రీవేంకటేశ్వరుడికి అలంకరించిన.. ఆపాదమస్తక హారాలు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలు. అందులో పదివేల పైచిలుకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి.. కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ అమూల్య అక్షర సంపదను సేకరించి శ్రీవారి పాదపద్మాలకు తిరిగి సమర్పించే ప్రయత్నం ఎంతోకాలంగా జరుగుతున్నది.
ఆ ప్రయత్నంలో వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, వేటూరి ఆనందమూర్తి తదితరుల కృషి అపారం. ఈ తరానికి సంబంధించి.. ఆ సుజ్ఞాన నిధి అన్వేషకులలో గంధం బసవ శంకరరావు ఒకరు. తంజావూరు సరస్వతీ మహలులోని గుట్టలకొద్దీ తాళపత్రాలను శోధించి, మథించి ఈ మహా కీర్తనలను మనకు అందిస్తున్నారు. నాయికా నాయకుల సంవాద రూపంలోని ‘అంట కౌగిలించి మానేవదేమో వోయి’ మొదలు ‘సిగ్గులు బడితే సింగారము మరి’ వరకు మొత్తం ఎనభై తొమ్మిది కీర్తనలు ఉన్నాయి. భక్తి, రక్తి, విరక్తి, మోక్షానురక్తి కలగలిసిన సంకీర్తనలివి.
నిజానికి ఈ మహాయజ్ఞం ఇక్కడితో ఆగిపోలేదు. శిథిల తాళ పత్రాల మీద, నర్మగర్భమైన నాగరి లిపిలో అనేక కీర్తనలు అజ్ఞాతంలో మిగిలిపోయాయనీ, వాటిని వెలికితీసి శ్రీనివాసుడి సమక్షంలో సమర్పించడమే తన లక్ష్యమని చెబుతున్నారు శంకరరావు. ఈ సేకరణ, పరిష్కరణ మహాయజ్ఞంలో ఆచార్య వేటూరి ఆనందమూర్తి పాత్ర ఎనలేనిదని ముందుమాటలో కీర్తించారు.
శ్రీవేంకటేశ పదములు
సంపాదకత్వం-పరిష్కరణ: వేటూరి ఆనందమూర్తి గంధం బసవ శంకరరావు, కె.ఐ. వరప్రసాద రెడ్డి
పేజీలు: 176; వెల: రూ.65 ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానం
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
స్వాప్నికుల సిలబస్!
కొందరంతే! ఎవరో వేసిన ఎంగిలి దారిలో నడవడం నచ్చదు. ఎవరో స్థాపించిన కంపెనీలో కొలువు చేయడం ఇష్టం ఉండదు. ఎవరి ఐడియానో అనుసరించడం కష్టంగా అనిపిస్తుంది. సరికొత్తగా స్వప్నిస్తారు. రాళ్లేరుకుని, కంచె తొలగించుకుని, గోతులు పూడ్చుకుని.. తమ నుదుటిరాత తామే రాసుకుంటారు. ఆంత్రప్రెన్యూర్షిప్కు నిలువెత్తు ఉదాహరణ అవుతారు. అలాంటివారి కథలే సునీల్ ధవళ ‘చైతన్య తరంగాలు’. పాతిక గెలుపు కథలూ పాఠకుల గుండెల్లో పాతుకుపోతాయి. రక్షిత వలయాన్ని ఛేదించుకుని.. సవాళ్ల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాలనే తపన కలిగిస్తాయి. ఎలన్ మస్క్ నుంచి భవిష్ అగర్వాల్ వరకు.. స్పేస్ ఎక్స్ మొదలు ఓలా వరకు.. ‘ఇది కదా జీవితం’ అనిపించే స్ఫూర్తిదాయక కథనాలే. ‘వయసు అనేది మనసుకు మనం పెట్టుకున్న పరిమితి తప్పించి మరొకటి కాదు. దాదాపు తొంభై ఏండ్ల వయసులోనూ ఐకియా సంస్థను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాను – ఇన్గ్వర్ కాంప్రాడ్ (ఐకియా వ్యవస్థాపకుడు)’ తరహా స్వర్ణాక్షరాలు నిర్లిప్తతను తొలగిస్తాయి, పెనునిద్దుర వదిలిస్తాయి.
చైతన్య తరంగాలు
రచన: సునీల్ ధవళ
పేజీలు: 260; వెల: రూ.299
ప్రతులకు: ఫోన్: 9741747700, అమెజాన్