చండీగఢ్: బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు పశ్చిమబెంగాల్ గవర్నర్గా పనిచేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి మమతాబెనర్జికి, ఆయనకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమన్నది. మరోవైపు కేరళలోనూ గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్నది.
ఈ క్రమంలోనే తాజాగా పంజాబ్లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు, భగవంత్ మాన్ ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ నియామకంపై వీరి మధ్య వార్ షురూ అయ్యింది. వీసీ సత్బీర్సింగ్ది అక్రమ నియామకమని, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా, ఛాన్సెలర్ అయిన తన ఆమోదం తీసుకోకుండా నియామకం జరిగినందున తక్షణమే ఆయనను తొలగించాలని గవర్నర్ పురోహిత్ సీఎం భగవంత్మాన్కు లేఖ రాశారు.
అయితే, గవర్నర్ తీరును పంజాబ్లోని ఆప్ సర్కారు తప్పుపట్టింది. రాష్ట్ర వ్యవసాయరంగానికి పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెన్నెముఖ లాంటిదని, అలాంటి యూనివర్సిటీకి యూనివర్సీటీ బోర్డుచే వీసీగా నియమితులైన సత్బీర్సింగ్ను తొలగించాలని గవర్నర్ లేఖ రాయడం ఆయనను అవమానించడమేనని పంజాబ్ వ్యవసాయ శాఖ మంత్రి కేఎస్ ధలివాల్ విమర్శించారు. అందుకు గవర్నర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.