Producer | తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత, రోజా ఆర్ట్స్ అధినేతల్లో ఒకరైన ఎం. అర్జున రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన అర్జున రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంస్థలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఎం. అర్జున్ రాజు ప్రముఖ నిర్మాణ సంస్థ రోజా ఆర్ట్స్ ద్వారా అనేక చిత్రాలను నిర్మించారు. నిర్మాత శివరామరాజుతో కలిసి ఆయన నిర్మించిన “కొండవీటి సింహం”, “వేటగాడు” వంటి సినిమాలు అప్పట్లో భారీ విజయాలను సాధించాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చాయి.
ఇక రోజా ఆర్ట్స్తో పాటు రోజా ఆర్ట్ ప్రొడక్షన్స్, రోజా ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై కూడా ఆయన పలు చిత్రాలను నిర్మించి నిర్మాతగా తన ముద్ర వేశారు. సినిమాల నిర్మాణంలో నిబద్ధత, ప్రొఫెషనల్ ధోరణితో పనిచేసే నిర్మాతగా ఆయనకు పరిశ్రమలో మంచి పేరు ఉంది.ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక అర్జున రాజు అంత్యక్రియలు మార్చి 14, 2026న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
అర్జున రాజు మృతి పట్ల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు భగవంతుడు తగిన మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించింది. అలాగే ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కూడా ఆయన మరణంపై విచారం వ్యక్తం చేశాయి. అర్జున రాజు నిర్మించిన చిత్రాలను గుర్తుచేసుకుంటూ, ఆయనను నిబద్ధతతో పనిచేసే నిర్మాతగా కొనియాడాయి. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. ప్రముఖ నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన అర్జున రాజు మృతి టాలీవుడ్కు తీరని లోటుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.