న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు అండదండలు అందించాలంటే కరెన్సీ నోట్ల ముద్రణ ఒక్కటే మార్గమని కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతి ఉదయ్ కోటక్ ప్రభుత్వానికి సూచించారు. “ఇది రెండు స్థాయిల్లో జరగాలి.. మొదటిది, అట్టడుగున ఉన్నవారికోసం.. రెండోది, మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయిన రంగాల కోసం. నా అభిప్రాయం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ వత్తాసుతో.. ద్రవ్య విస్తరణ అంటే కరెన్సీ అచ్చు వేయడం ద్వారా ప్రభుత్వం తన బ్యాలెన్స్ షీట్ విస్తరించుకునేందుకు ఇదే సరైన అదను. మనం ఈ పని చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?” అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రశ్నించారు.
“అత్యంత పేదలైనవారికి వైద్యపరమైన ప్రయోజనాలు కల్పించాలి” అని ఆయన చెప్పారు. దాదాపుగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థను ఘోరమైన సెకండ్వేవ్ వచ్చి దారుణంగా దెబ్బతీసింది. జనవరి నాటికి ప్రభుత్వం దశలవారీగా నియంత్రణలను ఎత్తివేసే పనిలో పడింది. కానీ కోవ్డ్ కేసులు పెరగడంతో దాదాపు ప్రతి రాష్ట్రంలో మళ్లీ కొత్తగా నియంత్రణలు పెట్టాల్సి వచ్చింది. దాంతో బిజినెస్కు బ్రేకులు పడ్డాయి. వత్తిడికి లోనవుతున్ రంగాలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం గతేడాది విజయవంతమైన రుణ ప్రణాళికను రూపొందించింది. దానిని ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచాలని కోటక్ సూచించారు. మరిన్ని రంగాలకు విస్తరించాలని, వీలైనంత త్వరగా సాయం అందేలా చూడాలని ఉదయ్ కోటక్ చెప్పారు. గతేడాది మహమ్మారి చుట్టుముట్టినప్పటి నుంచి 23 కోట్లమంది పేదరికంలోకి జారిపోయారు. వారిలో యువత, మహిళలు అధికంగా ఉన్నారు. సెకండ్వేవ్ ఈ పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నట్టు కనిపిస్తున్నది. గత ఏడాది మార్చి నుంచి ప్రవేశపెడుతున్న లాక్ డౌన్ల వల్ల 10 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వారిలో 15 శాతం మంది సంవత్సరాంతంలోనూ మల్లీ ఉపాధి పొందలేకపోయారు. అవసరార్థులను , నిస్సహాయ వర్గాలను ఏదో విధంగా ఆదుకోక తప్పదని కోటక్ తెలిపారు.