వాటికన్ సిటీ: మయన్మార్లో జరుగుతున్న రక్తపాతం అంతమవ్వాలని ఆకాంక్షించారు పోప్ ఫ్రాన్సిస్. ఈ హింసను ఆపడానికి మయన్మార్ వీధుల్లో తాను కూడా మోకాళ్లపై ప్రాధేయపడతానని ఆయన అన్నారు. మయన్మార్లో జరుగుతున్న హింసలో ఇప్పటి వరకూ 180 మంది నిరసనకారులు చనిపోయారు. ఈ హింస ఆపాలని గతంలోనూ ఓసారి అభ్యర్థించిన పోప్.. తాజాగా మరోసారి అప్పీల్ చేశారు. తమ దేశం కోసం ఎంతో మంది, ముఖ్యంగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం ఉన్నదని పోప్ అన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని, తాను కూడా మోకాళ్లపై కూర్చని హింసను ఆపాల్సిందిగా అభ్యర్థిస్తానని చెప్పారు. రక్తపాతం ఏ సమస్యనూ పరిష్కరించదని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్యే ఓ క్రైస్తవ సన్యాసిని మయన్మార్ వీధిలో మోకాళ్లపై కూర్చొని సైన్యాన్ని ప్రాధేయపడిన విషయం తెలిసిందే.