రవీంద్రభారతి, ఏప్రిల్ 11: వివక్షలేని సమసమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జ్యోతిబాపూలే 196వ జయంతి వేడుకలు సోమవారం రవీంద్రభారతిలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ..మహాత్మా పూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండవర్ణాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని నియోజవర్గాల్లో పూలే పేరుతో బీసీ గురుకుల విద్యాలయాలు నెలకొల్పిందని అన్నారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పూలేను ఆదర్శంగా తీసుకొని బీసీ యువత ముందుకు సాగాలన్నారు.
బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్చేశారు. బీసీలకు సమాన వాటా ఇచ్చేవరకు పోరాడుతామన్నారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ బీసీ విద్యార్థులు ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల విద్యను, కోచింగ్లను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రూప్ పరీక్షల కోసం బీసీలకు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూలే జయంతి వేడుకల చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరిగౌరీశంకర్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్మేరు, బడే సాబ్, నీలా వెంకటేశ్, సీ రాజేందర్, జాజుల లింగంగౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.