(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : హింసాత్మక ఘటనలతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రక్తసిక్తమయ్యింది. స్థానిక చట్టసభలో శరణార్థులకు కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్న డిమాండ్తో సోమవారం మొదలైన ఆందోళనలు రక్తసిక్తంగా మారాయి. నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 40 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. తమ ఆత్మీయుల మృతదేహాలను తీసుకెళ్లడానికి ముజఫరాబాద్, మీర్పుర్లోని దవాఖానలకు వచ్చిన బాధితుల బంధువులను భద్రతా దళాలు అడ్డుకొన్నాయి. దీంతో వారు హాస్పిటల్స్ ముందే నిరసనకు దిగారు. తమ వారి అంత్యక్రియలు చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. పీవోకేలో మానవహక్కుల హననం జరుగుతున్నదని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతలు మండిపడ్డారు.
పీవోకేలో నిరసనలు నిర్వహిస్తున్నవారు భారత్ లాంటి శత్రువులేనని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. అలాంటి వారితో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. పీవోకేను పాకిస్థాన్ కశ్మీర్గా పేర్కొంటూ అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని ఖండించిన భారత్.. పాక్ ఆక్రమిత కశ్మీర్గా పేర్కొనాలని హితవు పలికింది.