ఆడపిల్లలమని భయపడలేదు. మేం ఎందుకు చేయకూడదు అనుకున్నారు.. నాన్న పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు. ఒత్తిడి తగ్గించాలని నాన్నకు తోడుగా ఇంటింటికి అక్షరాల వెలుగులు పంచుతున్నారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పొద్దున్నే పేపర్లు వేస్తూ కుటుంబపోషణలో తండ్రికి తోడుగా భాగస్వాములవుతున్నారు. వారే ఎస్పీఆర్ హిల్స్ కమలానగర్కు చెందిన రాందాస్నాయక్, లక్ష్మీ కుమార్తెలు ప్రమీల, పవిత్ర.
1999 నుంచి కెలావత్ రాందాస్నాయక్ రూ.200 జీతంతో పేపర్బాయ్గా జీవితం ప్రారంభించాడు. కొవిడ్ ముందు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు నిత్యం 700 వివిధ దినపత్రికలను ముగ్గురు బాయ్స్తో కలిసి వేసేవాడు. అనంతరం 8.30 గంటల నుంచి ఫిలింనగర్లోని రేషన్ దుకాణంలో పార్ట్టైం ఉద్యోగిగా పనిచేసేవాడు. కరోనా మహమ్మారితో పనిచేస్తున్న బాయ్స్ మానేశారు. దీంతో రాందాస్నాయక్పై భారం పెరిగింది.
నిత్యం నాన్న ఒక్కడే పేపర్లు వేస్తుండడాన్ని చూసి చలించిపోయారు. నాన్నకు తోడుగా ఉండాలని నిర్ణయించుకొని మోతీనగర్ పేపర్ పాయింట్లో తెల్లవారుజామున్నే 5 గంటలకే పేపర్లు సర్దడం ప్రారంభిస్తారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. స్లిప్పులన్నీ (పేపర్లు) జమాంచి.. పేపర్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాలనీలబాట పడతారు. గల్లీలు, కాలనీల్లోని ఇల్లిల్లు తిరుగుతూ పేపర్ అందజేస్తూ గుడ్మార్నింగ్ అంటూ పలుకరిస్తారు. ప్రస్తుతం 10 కాలనీలకు కలిపి 300 పేపర్లకుపైగా పాఠకులకు అందిస్తున్నారు. ప్రమీల ఇంటర్ ఫస్టియర్, పవిత్ర 10వ తరగతి చదువుతోంది.
నాన్న ఒక్కడే పేపరేయడం వల్ల లేటవుతుందని అనేవారు. డాడీపై భారం పెరిగింది. దీంతో నేను,మా చెల్లి పూర్తిస్థాయిలో పేపర్ వేయడం మొదలుపెట్టాం. అమ్మ ప్రైవేట్ ఆఫీసులో పనిచేసేది. కరోనా ప్రభావం వల్ల ఉద్యోగం పోయింది. నాన్న ఒక్కడి కష్టంతో మమ్ముల్ని పోషించడం గగనంగా మారింది. కష్టపడి పనిచేస్తూ..చదువుకుంటూ..ఇద్దరక్కాచెల్లెళ్లం పోలీస్ ఆఫీసర్లమవుతాం. -ప్రమీల, పెద్ద కూతురు
నాతో పేపర్ వేయగలరా? అన్న తండ్రి అడిగిన ఒక్క మాటతో స్ఫూర్తి పొందామంటున్నారు ప్రమీల, పవిత్ర. గత ఐదేండ్ల నుంచి వానైనా, చలైనా అన్నింటికీ తట్టుకొని పాఠకులకు పేపరు అందజేస్తున్నారు. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు తండ్రికి ఆసరా ఉంటూ ఇంటి బాధ్యతలను పంచుకుంటున్నారు.
నాన్నను చూసి కష్టపడే తీరు నేర్చుకున్నా. ఒక్కడే సైకిల్పై తిరుగుతూ పేపర్లు వేయడం సాధ్యం కాదని అర్థమైంది. నాన్నకు తోడుగా ఇద్దరం ఆరేడు కాలనీల్లో పేపర్లు పంచుతాం. లక్ష్యం పోలీస్ కావడమే. ఏ పనైనా పట్టుదలతో చేయాలని నాన్న నేర్పారు. మాకు ఇబ్బందవుతుందని గమనించి ఇటీవలే వాయిదాల్లో స్కూటీ కొనిచ్చాడు. -పవిత్ర, చిన్న కూతురు
2001లో పేపరేస్తే నెలకు రూ.250 జీతం వచ్చేది. చాలకపోవడంతో ఫిల్మ్నగర్లోని రేషన్ దుకాణంలో పనిచేస్తే జీతం కింద 20 కిలోలు బియ్యం ఇచ్చేవారు. దీంతో ఇల్లు గడిచేది. పిల్లలు పెద్దయ్యాక ఖర్చులు పెరిగినయి. స్కూలు ఫీజులు, ఇల్లు కిరాయి, తలకుమించిన భారమైంది. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో వారికి తెలిపేందుకు ఇదొక ఉదాహరణగా ఉంటుందని అనుకుంటున్నా. కుటుంబపోషణ కోసం పనులు చెప్పడం తప్పేడం లేదు. – రాందాస్నాయక్, ప్రమీల, పవిత్రల తండ్రి