ఖైరతాబాద్ : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జన ఘట్టం ఆదివారం జరుగునున్నది. ఈ నెల 10న వినాయచవితి మొదలు నవరాత్రులు పూజలందుకున్న స్వామి వారు నిమజ్జనోత్సవానికి ముస్తబవు తున్నారు. కరోనా కలిని పారద్రోలాలని వేడుకుంటూ ఈ సారి శాస్త్రోక్తంగా పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ముందస్తుగా నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించింది.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం శుక్రవారం సాయంత్రం నుంచే మొదలు పెట్టారు. గణనాధుడు ఆశీనులయ్యే ట్రాలీని సిద్ధం చేయగా, దానిపై అమర్చేందుకు అనువుగా ఉండేందుకు ఐరన్ రాడ్స్కు వెల్డింగ్ పనులు చేపట్టారు. గణేశుడిపై ఉన్న షెడ్ల తొలగింపు పనులు సైతం ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారు జామును కర్రలను తొలగిస్తారు. అదే రోజు రాత్రి 12గంటల తర్వాత ట్రాలీ, భారీ క్రేన్ అక్కడకు చేరుకుంటాయి.
ఆ తర్వాత గణపతి ముందు ఉన్న కలశాన్ని కదిలిస్తారు. మరుసటి రోజు ఆదివారం 3 నుంచి 4 గంటల మధ్య ప్రత్యేక పూజలు చేసి విగ్రహానికి ఉద్వాసన పలుకుతారు. ఉదయం 6గంటల విగ్రహాన్ని ట్రాలీ మీద పెడుతారు. రెండు గంటల పాటు ట్రాలీపై విగ్రహానికి వెల్డింగ్ ప్రారంభిస్తారు. 8గంటల నుంచి 9గంటల వరకు ట్రాలీని అలంకరిస్తారు. 9గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12గంటలకు నిర్ణీత క్రేన్ వద్దకు చేరుకుంటుంది.
మరో రెండు గంటలు వెల్డింగ్ పనులు కొనసాగుతాయి. గణేశుడి వద్ద ఉంచిన కలశాన్ని గంగలో కలిపిన తర్వాత నిమజ్జన ఘట్టం పూర్తవుతుంది. మధ్యాహ్నం 3నుంచి 3.30గంటల మధ్య నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ మీడియాకు తెలిపారు.