ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 3 : ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశాన్ని ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓయూ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కంచి మనోహర్, టి.మల్లేశ్, సిద్ధిఖి బేగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, పీఆర్సీ బకాయిల గురించి చర్చించేందుకు ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తమకు రావాల్సిన పీఆర్సీని అమలు చేయకుండా ఓయూ అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ అధ్యాపకులకు పీఆర్సీని అమలు చేయడంతో పాటు పీఆర్సీ బకాయిలను కూడా చెల్లించారని గుర్తు చేశారు. నాన్ టీచింగ్ ఉద్యోగులను వివక్షకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై చర్చించి, భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. ఓయూ నాన్ టీచింగ్ హోంలో ఉదయం 11గంటల నుంచి నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.