సిద్దిపేట : జిల్లాలోని కొండపాక మండలం మంగోల్ క్రాస్ రోడ్ సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుకునూరుపల్లి ఎస్ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. మర్కూక్ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన ఎడమ పరశురాములు, ఎడమ నర్సింలు ఇద్దరూ కలిసి బైక్పై సిద్దిపేట వైపు వెళ్తుండగా ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నర్సింలు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పరశురాములుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.