ఇప్పటికీ ‘వరకట్నం కోసం వివాహిత హత్య’, ‘అదనపు కట్నం కావాలంటూ వేధింపులు’,‘కానుకలు ఇచ్చుకోలేక ఆత్మహత్య’ తదితర వార్తలు సర్వసాధారణం అయిపోయాయి. ఆడపిల్ల పెండ్లి అంటే ప్రతి తండ్రీ ముందుగా ఆలోచించేది కట్నం బరువు గురించే. అందుకే, కట్నం ఊసే లేని పెండ్లిళ్లను ప్రోత్సహిస్తున్నారు నో డౌరీ షాదీ.కామ్ వ్యవస్థాపకురాలు సీమా సింగ్.
పెండ్లీడు బిడ్డ కోసం ఓ మంచి సంబంధం చూడటం.. వరుడి గురించి, వరుడి తల్లిదండ్రుల గురించి ఆరా తీయడం, ఆ పైన పెండ్లిచూపులు- అన్నీ చకచకా జరిగిపోతాయి. అంతా కుదిరే సమయానికి కట్నం లెక్కలు ముందుకొస్తాయి. సీమా సింగ్ (53) కూతురి విషయంలోనూ అదే జరిగింది. పెండ్లిచూపుల తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. ఉంగరాలు మార్చుకునే సమయానికి పిడుగులాంటి మాట.. ‘అబ్బాయికి అమెరికాలో జాబ్. ఒక హై-ఎండ్ కారు కావాలి. దానితోపాటు నగలు, డబ్బు ముట్టజెప్పాలి’. ముందు అనుకున్నదానికి భిన్నంగా నిశ్చితార్థంలో కోరికల చిట్టా విప్పుతుంటే ఆ తల్లికి ఆశ్చర్యమేసింది. వాళ్ల మీద అసహ్యమూ కలిగింది. ఆ సంబంధాన్ని వెంటనే రద్దుచేసుకుంది. ఆ చేదు అనుభవం నేర్పిన పాఠంతో ‘నో డౌరీ షాదీ.కామ్’ అనే వెబ్సైట్కు రూపం ఇచ్చింది. క్రమంగా ‘నో డౌరీ షాదీ’లో రిజిస్ట్రేషన్ల్లు పెరిగాయి. కొద్దిరోజులకే కట్నం వద్దనుకునే కుటుంబానికి సీమ కూతురు కోడలైంది. ఆ వెబ్సైట్ సాక్షిగా ఇప్పుడు కట్నకానుకలు లేకుండానే పెండ్లిళ్లు జరుగుతున్నాయి. వివరాలు నమోదు చేసుకునేటప్పుడే ‘అబౌట్ మీ’ అనే కాలమ్లో కట్నంపై అభి
ప్రాయాన్ని తెలపాలి. కుల ప్రస్తావన లేకపోతే మరీ సంతోషం.