NTR | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని వారాలుగా పలు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు కొత్త సినిమా ‘డ్రాగన్’ షూటింగ్ పదేపదే వాయిదా పడుతుండగా, మరోవైపు షూటింగ్ సమయంలో గాయపడటం, సోషల్ మీడియాలో చోటుచేసుకున్న వివాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అనేక కారణాలతో షూటింగ్కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
గతంలో షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడటంతో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ నిలిచిపోయింది. అనంతరం విదేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో జార్జియాలో ప్లాన్ చేసిన షెడ్యూల్ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కథకు సంబంధించిన మార్పులు, చర్చల కారణంగా కూడా షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.ఇలా వరుస ఆటంకాల కారణంగా సినిమా విడుదల కూడా ముందుగా అనుకున్న షెడ్యూల్ నుంచి ఆలస్యమై, ప్రస్తుతం 2027 విడుదలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒకసారి గాయపడి కోలుకున్న ఎన్టీఆర్ తాజాగా మరోసారి షూటింగ్ సందర్భంగా భుజానికి గాయమైనట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటూ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ గాయం కారణంగా షూటింగ్కు మరోసారి బ్రేక్ పడినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై చిత్రబృందం నుంచి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల ‘రా ఎన్టీఆర్’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆ సంస్థ తమ సేవా కార్యక్రమాల గురించి ప్రకటనలు చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.దీనిపై స్పందించిన ఎన్టీఆర్ టీమ్, ఆ సంస్థకు ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అనంతరం ఆ సంస్థ కూడా స్పందించడంతో సోషల్ మీడియాలో చర్చ మరింత ముదిరింది. ఎన్టీఆర్ అభిమానుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవగా, కొంతకాలం పాటు ఈ అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.తర్వాత ఆ సంస్థ తమ సేవా కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ వివాదం క్రమంగా సద్దుమణిగింది. ఒకవైపు సినిమా షూటింగ్ ఆలస్యం, మరోవైపు గాయాలు, సోషల్ మీడియాలో వివాదాలు వరుసగా చోటుచేసుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.