నిజామాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం చేపట్టి, వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నది. దీంతోపేద కుటుంబాలకు భారీ ఊరట దక్కుతున్నది. గ్రామాల్లో, పట్టణాల్లో వేల సంఖ్యలో మంజూరు చేసిన డబుల్ బెడ్రూంఇండ్లతో ఎందరికో గూడు లభించింది. సమైక్య పాలకుల హయాంలో పేద కుటుంబాలకు మేలు చేయాలనే ఆలోచన అమలు కాలేదు. ఇచ్చిన ఇండ్లు ఎటూ సరిపోయేవి కాదు. పిట్టగూడు లాంటి ఇండ్లలో చిన్నపాటి కుటుంబం కూడా జీవించలేని దుస్థితి ఉండేది. డబుల్ బెడ్ రూం ఇండ్లతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పథకం.. ఏడేండ్ల కాలంలో అమలై ఎంతో మంది అభాగ్యులకు కొండంత ఆసరాగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేద వారికి పలు ప్రాంతాల్లో ఇండ్లు అందించారు. తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన మరో ప్రకటన పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆసక్తిని పెంచింది. సొంతింటి స్థలం కలిగి ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించి అమలు చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికంగా చేయూత
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలో సొంతింటి జాగ ఉన్న వారికి ఆర్థికంగా చేయూతను అందిస్తామని హామీ ఇచ్చింది. రూ.5లక్షల వరకు ప్రభుత్వమే డబ్బులు అందించడం ద్వారా లబ్ధిదారుడు తనకు ఇష్టమైన రీతిలో సొంతింటి నిర్మాణాన్ని చేపట్టుకోవచ్చని పార్టీ హామీల్లో స్పష్టంగా పేర్కొంది. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలుచేస్తున్న ప్రభుత్వం ఇక సమీప భవిష్యత్తులో సొంతింటి నిర్మాణానికి ఆర్థిక భరోసా కల్పించే పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఇందులో భాగంగా ఈ మధ్యనే శాసనసభ సమావేశాల్లో చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రకటన చేయడం ఆయా వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగించింది. గ్రామాల్లో చాలా మందికి సొంతింటికి జాగ అందుబాటులో ఉంటుంది. కానీ ఇంటి నిర్మాణం చేపట్టేందుకు రూ.లక్షలు పెట్టుబడి పెట్టే స్థోమత ఉండదు. అలాంటి వారికి సీఎం కేసీఆర్ తీసుకురానున్న పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. పేద, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం భారీ సాంత్వన చేకూర్చనుంది. ఎంతో కొంత ఆర్థిక మద్దతు అందడం ద్వారా మిగిలిన సొమ్మును లబ్ధిదారుడే కలుపుకుని సొంతింటిని నిర్మించుకునేందుకు ఎక్కువ అవకాశం లభించనున్నది.
చెదిరిన కుటుంబాలకు గూడు
ఇండ్లు లేని పేదలకు మేలు చేకూర్చాలని యోచించి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏడేండ్ల కాలంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో వేలాది ఇండ్లు మంజూరు చేయించి నిధులు సమకూర్చారు. ఆయా ప్రాంతాల్లో డబుల్ ఇండ్ల సముదాయాలు ప్రధాన రహదారులకు పక్కనే విల్లాల మాదిరిగా రూపుదిద్దుకున్నాయి. కొన్ని చోట్ల అర్హులకు అందించడంతో పేద కుటుంబాలు అందులోనే జీవనం సాగిస్తున్నాయి. మానవతా దృక్పథంతో కూడిన ఈ పథకం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు విలువైన ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేరింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ ఎన్నో కుటుంబాలకు డబుల్ ఇండ్లతో లాభం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బాన్సువాడలో ఆరు వేలకు పైగా ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే సగానికి ఎక్కువగా నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందించారు. మిగిలిన ఇండ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ పేదల ఇండ్ల నిర్మాణం ఊపందుకుంది. అతి త్వరలోనే అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. పేదల చిరకాల కోరికను ప్రతిష్టాత్మక పథకంతో కేసీఆర్ సర్కారు నెరవేర్చబోతోంది.
నియోజకవర్గానికి 1000- 1200 ఇండ్లు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నూతనంగా తీసుకురానున్న పథకాన్ని తొలుత వెయ్యి మంది నుంచి 1200 మందికి వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పథకం ప్రారంభ దశలో కొద్ది మందితో మొదలుకానున్నది. ఆ తర్వాత అర్హులైన వారికి దశల వారీగా పథకాన్ని విస్తరింప జేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉమ్మడి జిల్లాలో వేలాది సంఖ్యలో మంజూరవ్వగా అన్ని చోట్ల వేగంగా నిర్మాణం అవుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 2230, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1486, ఆర్మూర్ నియోజకవర్గానికి 1552, బాల్కొండ నియోజకవర్గానికి 2580, బోధన్ నియోజకవర్గానికి 1712, కామారెడ్డి నియోజకవర్గానికి 1715, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1735, బాన్సువాడ నియోజకవర్గానికి 6645, జుక్కల్ 1466 చొప్పున డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేయగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా, కొన్నిప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించడంతో గృహప్రవేశాలు పూర్తిచేసుకున్నారు.