గ్రామంలో ఆరు ప్రకృతి వనాల ఏర్పాటు
జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక
కామారెడ్డిరూరల్, మార్చి 19 : కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామం అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఒక్కటే ఉండగా గర్గుల్ గ్రామంలో మాత్రం పాఠశాల, ఆలయాల ఆవరణలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటి పార్కులుగా తీర్చిదిద్దారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేసి సమష్టి కృషితో ముందుకు సాగుతున్నారు.
ఆరు పార్కులు.
ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం తప్పని సరిగా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కానీ గర్గుల్లో ఆరు ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతోపాటు నిరంతరం కలుపు తీయడం, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడం, రోజూ నీటిని అందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టు, ఎల్లమ్మ ఆలయం వద్ద, బ్రహ్మంగారి మఠం వద్ద, పాఠశాల ఆవరణతో పాటు ఆక్సిజన్ పార్కు, ఈత వనాలను ఏర్పాటు చేశారు. అలాగే పాఠశాల ఆవరణలో ఉదయం వాకింగ్ చేసే వారి కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు.
దాదాపుగా జిల్లాలోనే కొన్నేండ్లుగా వంద శాతం పన్ను వసూలు చేయడంలో గ్రామం ముందంజలో ఉంటున్నది. గ్రామంలో 2340 మందికి పైగా జనాభా ఉన్నారు. సకాలంలో ఇంటి పన్ను వసూలు చేయడంతో పాటు విద్యుత్, నీటి సమస్యలు ఏవి ఉన్నా వెంటనే వార్డు సభ్యుడు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒకటి రెండు రోజుల్లోనే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు.
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత,ఐదు మొక్కలు
గ్రామంలో దాదాపుగా 95 శాతం ఇండ్లల్లో ఇంకుడు గుంత, ఇంటి ఆవరణలో మొక్కలు కనిపిస్తాయి. గర్గుల్ గ్రామానికి కామారెడ్డి, రామారెడ్డి, తిమ్మక్పల్లి, ఇస్రోజివాడి నాలుగువైపులా ఉన్న రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీ ట్యాంకర్తో పాటు సర్పంచ్ రవితేజాగౌడ్ సొంత ట్యాంకర్తో నీటిని అందిస్తున్నారు. అలాగే ఎక్కడా లేని విధంగా వైకుంఠ రథం, ఫ్రీజర్ ఏర్పాటు చేయించారు.