‘75 ఏండ్లు పూర్తయిన స్వతం త్ర భారత తొలి బడ్జెటును నేను ప్రవేశ పెడుతున్నా’ అని గొప్పగా చెప్పిన విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులకు వచ్చేసరికి పెదవి దాట లేదు. ప్రధానితో సహా మంత్రులందరూ మాట మాటకు బల్లలు ఎట్ల రిథమ్ వచ్చేలా చరచాలని పార్లమెంట్ సాక్షిగా ప్రాక్టీస్ చేశారు. అధికార పార్టీ ఎంపీలైతే మోదీ నామాన్ని పోటీపడి స్మరించుకున్నారు. ఇటు నిర్మలా సీతారామన్ కూడా అమృత్ కాల్, ఆజాది కా అమృత్ మహోత్సవ్, ప్రధానమంత్రి వికాస్ యోజన లాంటి పేర్లను జోడించి విన సొంపైన కవితలుగా కార్యక్రమాలను వల్లె వేశారు.
సప్తఋషి పేరుతో (1) సమ్మిళిత అభివృద్ధి (2) చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం (3) మౌలిక వసతుల కల్పన (4) పెట్టుబడులకు ప్రోత్సాహం (5) సంభావ్యతలు (6) హరిత వృద్ధి (7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ర్టానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం గమనించదగ్గ విషయం. బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు ఏ విధమైన రోడ్ మ్యాప్ లేదు. ఏకలవ్య స్కూల్స్లో మాత్రం 38,800 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పలేదు. వీటి కోసం కొన్ని కోట్ల మంది యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగులను తీసివేస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి నిధులు కేటాయించకపోవటం దురుదృష్టకరం. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో రూ.75 వేల కోట్లు ప్రకటించారు. అది కేవలం 100 నగరాలకు మాత్రమే. కానీ గ్రామీణ సడక్ పథకానికి కేటాయింపులు పెరగలేదు. ఎస్టీల సంక్షేమాన్ని మరిచి 3 కోట్ల ఎస్టీ కుటుంబాలకు కేవలం 15 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్కూళ్ళ నిర్మాణానికి ఖర్చు పెట్టరు కానీ ఎంతో ఖర్చుతో కూడుకున్న డిజిటల్ లైబ్రరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారట.
రాష్ట్రాలకువడ్డీ లేని రుణాలు మరో ఏడాది పాటు ఇస్తామన్నారు. దీనికి బడ్జెట్లో రూ.13.7 లక్షల కోట్లు కేటాయించారు. తిరిగి చెల్లించడానికి దీనికి 50 ఏండ్ల వ్యవధి ఇస్తుండగా బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రమే ఈ కేటాయింపులు ఉండటం గమనార్హం. నిర్మలమ్మ మాట్లాడుతూ 9 ఏండ్లలో తలసరి ఆదాయం రెట్టింపయ్యిందన్నారు. అదే సమయంలో చైనా తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగింది. ఇటు తెలంగాణలో మూడు రెట్లు పెరిగింది. అలాగే కేవలం 23 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న అదాని గ్రూప్ సంపద విలువ ఈ కాలంలో దాదాపు 125 రెట్లు పెరిగింది.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ పునాదులపై దేశ నిర్మాణం చేపట్టేందుకు ఈ వార్షిక బడ్జెట్ దోహదపడుతుందని చెప్పారు. కానీ వారి మాటలు తప్ప చేతలు ఆశాజనకంగా లేవు. దేశంలో వ్యవసాయ కూలీల స్థితిగతులు మార్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచలేదు. ఎంతో కాలంగా ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, అర్బన్ ప్రాంతంలో కూడ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకు రావాలని కోరుతున్నా పట్టించుకోలేదు. ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 20 లక్షల కోట్లు. ఈ రంగంలో జీవనం సాగిస్తున్న 56 శాతం జనాభాకు ఇది ఏ మూలకు సరిపోదు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం ప్రేరణగా కిసాన్ సమ్మాన్ యోజనను తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పుడు మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని అనుకరించింది. మత్స్య సంపద పెంపుదలకు, మత్స్యకారులు చేపలు అమ్ముకునేందుకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్ విస్తరణ కోసం రూ.6000 కోట్లు పెట్టుబడు లు పెట్టనున్నట్లు ప్రకటించింది. చేనేత రంగాన్ని ఆత్మనిర్భర్ కింద అభివృద్ధి చేస్తామని చెప్పటం చేనేత కార్మికులకు కొంత ఉపశమనం. అలాగే తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్, హరితహారానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వనున్నది. నాణ్యమైన, ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలను ప్రోత్సహించడం కోసం రూ. 2,200 కోట్లు కేటాయించింది. సిరి అన్నం పథకం ద్వారా చిరుధాన్యాలను రైతులకు అందించడం మంచి పరిణామం. తెలంగాణలో సఫలమైన గురుకుల విద్యాలయాలను ఆదర్శంగా తీసుకొని ఏకలవ్య పాఠశాలలను పెద్ద మొత్తంలో ప్రోత్సహించడం, అలాగే ఇంటింటికి నల్లా నీళ్లనిచ్చే మిషన్ భగీరథ లాంటి స్కీంలను కేంద్రం జల్ జీవన్ మిషన్ క్రింద దేశవ్యాప్తంగా అమలు చెయ్యడం మంచి పరిమాణమే కానీ, తెలంగాణ కృషిని గుర్తించి, గౌరవించాలన్న కృతజ్ఞతను మాత్రం చూపలేదు.
మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకీకరణ, పెట్టుబడుల ఉపసంహరణలో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొంటున్నది. ప్రతి ఏడాది రూ.50 వేల కోట్లకు తక్కువ కాకుండా కేంద్ర ఖజానాను మాత్రం నింపుకొంటున్నది. తన అనుకూల కార్పొరేట్ల కడుపు నింపటం కోసం ఈసారి రూ.51 వేల కోట్లను సమీకరించాలన్న లక్ష్యాన్ని నిర్ధారించుకున్నది. అందులో భాగంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎండీసీ, స్టీల్ లిమిటెడ్, బి.ఇ.యం.ఎల్., హెచ్.ఎల్.ఎల్. లిఫ్కర్, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీఐ బ్యాంక్, వైజాగ్ స్టీల్ అమ్మకానికి నిర్ణయం తీసుకోవడం దేశ ప్రజలకు తీరని అన్యాయం.
డాక్టర్ బైరి నిరంజన్: 93901 15644
(వ్యాసకర్త : సహాయ ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం)