గౌహతి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్తో పాటు పర్యాటక శాఖ మంత్రి జయంత మల్ల బారువాలు వివాదంలో చిక్కుకున్నారు. వన్యప్రాణి సంరక్షణా చట్టాలను ఉల్లంఘించి.. ఆ ముగ్గురూ కజిరంగా జాతీయ పార్కులో నైట్ సఫారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఆ ముగ్గురిపై పోలీసు ఫిర్యాదు నమోదు చేశారు. శనివారం రోజున షెడ్యూల్ ముగిసిన తర్వాత రైనోలు నివసించే ప్రదేశంలో ఆ ముగ్గురూ సఫారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1972, వైల్డ్లైఫ్ ప్రొటక్షన్ యాక్ట్ ప్రకారం.. నిర్దేశిత సమయం ముగిసిన తర్వాత జాతీయ పార్క్లోకి ఎంటర్ కావడం నిషేధం. అయితే సద్గురు ఓ ఎస్యూవీను డ్రైవ్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ ఓపెన్ సఫారీ వాహనంలో హిమంత శర్మ, బారువా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎక్కడా వైల్డ్లైఫ్ చట్ట ఉల్లంఘన జరగలేదని, వార్డెన్ అనుమతి ప్రకారం నిర్దేశిత ప్రదేశంలో నైట్ సఫారీ చేయవచ్చు అని సీఎం శర్మ తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు తాము పార్క్ను విజిట్ చేశామని సద్గురు ఈషా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.