సాధారణంగా ఇద్దరు సూపర్ స్టార్స్ వస్తున్నప్పుడు బాక్సాఫీస్ దగ్గర మరో హీరో పోటీకి రావడానికి కాస్త ఆలోచిస్తాడు. కానీ నాగార్జున మాత్రం కావాలనే రిస్క్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది వైల్డ్ డాగ్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మరో విషయం కూడా బయటపెట్టాడు నాగార్జున. చాలా రోజుల నుంచి వార్తల్లో నానుతున్న బంగార్రాజు సినిమా గురించి ఓపెన్ అయిపోయాడు మన్మధుడు. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని.. త్వరలోనే పూర్తవుతుందని షాకింగ్ న్యూస్ చెప్పాడు.
ఇందులో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో ఆయన అనివార్య కారణాలతో తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆ పాత్ర కోసం మరో కుర్ర హీరోని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు నాగార్జున. ఇదే అందరికీ షాక్ ఇచ్చే విషయం. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశారు. పరశురాం దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట..క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరహర వీరమల్లు.. 2022 సంక్రాంతి వస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు.
ఇలాంటి సమయంలో నాగార్జున తన సినిమాను పండక్కి తీసుకొస్తాను అని చెప్పడం నిజంగానే సంచలన విషయం. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమాలు బాగా ఆడుతుంటాయి. 5 ఏళ్ల కింద 2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నాగార్జున. ఈ సినిమా అప్పట్లో 50 కోట్ల షేర్ వసూలు చేసింది. అప్పుడు కూడా పండక్కి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి భారీ సినిమాలు వచ్చాయి. వాటి మధ్య విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కూడా పవన్, మహేష్ మధ్యలో వచ్చి కూల్ గా విజయం అందుకోవాలని చూస్తున్నాడు నాగార్జున. అప్పుడు అప్లై చేసిన ఫార్ములా మరోసారి రిపీట్ చేస్తున్నాడు. మరి బంగార్రాజు ఆయన నమ్మకాన్ని ఎంత వరకు నిజం చేస్తాడనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.