Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె సైబర్ వేధింపులకు గురైన కేసులో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కీలక ముందడుగు వేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా అక్షయ్ కుమార్ 13 ఏళ్ల కుమార్తెను వేధించిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
అసలేం జరిగింది?
గత ఏడాది అక్టోబర్లో ముంబైలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘సైబర్ అవేర్నెస్ మంత్ 2025’ ప్రారంభోత్సవంలో అక్షయ్ కుమార్ స్వయంగా ఈ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తన కుమార్తె ఒక ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు, ఒక తెలియని వ్యక్తి మెసేజ్ల ద్వారా పరిచయమయ్యాడని ఆయన తెలిపారు. మొదట ఆ వ్యక్తి చాలా మర్యాదగా చాలా బాగా ఆడావు, నువ్వు ఎక్కడి నుంచి? అంటూ మెసేజ్లు పంపాడు. ఆ తర్వాత అబ్బాయివా లేక అమ్మాయివా అని ఆరా తీశాడు. తన కుమార్తె ‘అమ్మాయిని’ అని సమాధానం ఇవ్వగానే, ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన న్యూడ్ ఫోటోలు పంపమని అడిగాడు. అయితే వెంటనే అప్రమత్తమైన అక్షయ్ కుమార్ కుమార్తె, గేమ్ను ఆపేసి తన తల్లికి ఈ విషయాన్ని వివరించింది. పిల్లలు ఇలాంటి విషయాలను తల్లిదండ్రులతో పంచుకోవడం చాలా ముఖ్యమని అక్షయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ ఘటన నేపథ్యంలో అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఒక కీలక విన్నపం చేశారు. వీధి నేరాల కంటే సైబర్ నేరాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయని, పాఠశాలల్లో ప్రతి వారం సైబర్ అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయన కోరారు. డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఇలాంటి ట్రాప్లో పడకుండా ఉండటానికి అవగాహన ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ముంబైలోని ఒక కళాశాలలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ సెషన్లో అక్షయ్ కుమార్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ను విద్యార్థులకు ప్రదర్శించారు. ఆన్లైన్ ఆర్థిక మోసాలు, సోషల్ మీడియా భద్రత, ఫిషింగ్ ఎటాక్స్ మరియు సైబర్ బుల్లింగ్ వంటి అంశాల పట్ల విద్యార్థులు ఎలా అప్రమత్తంగా ఉండాలో పోలీసులు ఈ సందర్భంగా వివరించారు.