హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రానున్న నాలుగేండ్ల్లలో క్యాన్సర్ రోగుల సంఖ్య 12.5 శాతం పెరుగనున్నది. ఇది ఆందోళన కలిగించే అంశమైనప్పటికీ అవగాహన, ముందస్తు జాగ్రత్తలతో ఈ ముప్పును అడ్డుకోవచ్చంటున్నారు క్యాన్సర్ వైద్యనిపుణులు. రాష్ట్రవ్యాప్తంగా 2020లో 47,620 మంది రకరకాల క్యాన్సర్ వ్యాధులకు గురయ్యారు. 2025 నాటికి ఈ సంఖ్య 53,565కు చేరనున్నది. అంటే 12.5 శాతం మంది రోగు లు పెరగనున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) పరిధిలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రిసెర్చ్(ఎన్సీడీఐఆర్) వెల్లడించింది. మహిళల్లో ప్రతి ఏడుగురిలో ఒకరికి, పురుషుల్లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ బయటపడే అవకాశాలున్నట్టు ఈ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ ఆధారంగా నిమ్స్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు వెల్లడించారు.
ముందస్తు జాగ్రత్తతో అడ్డుకోవచ్చు
అవగాహన, ముందుజాగ్రత్త చర్యలతో క్యాన్సర్ ను అడ్డుకోవచ్చు. క్యాన్సర్కు కారణమయ్యే వాటికి దూరంగా ఉండ టం వల్ల 50 శాతం వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. పురుషుల్లో 42.2 శాతం, మహిళల్లో 13.5 శాతం మంది పొగాకు ఉత్పత్తుల వాడకంతో క్యాన్సర్ బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, వాతావరణ కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం వల్ల కూడా క్యాన్సర్ సోకే అవకాశాలున్నందున వాటిని నివారించాలి.