హైదరాబాద్ : గతంలో ఎన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య పోటీ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకోగా.. పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆదివారం ఉదయం ఎన్నికలు జరుగనుండగా.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెండు ప్యానెళ్లు సభ్యులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంచు విష్ణు ప్యానెల్ విజయం కోసం ఆయన తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో విష్ణుకే ఓటు వేయాలని ‘మా’ సభ్యులకు వాయిస్ మెస్సేజ్ పంపారు.
‘తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉంది. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే, కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి’ అంటూ వాయిస్ మెస్సేజ్లో సభ్యులను కోరారు.