ఆర్తి అగర్వాల్ అనుకున్నది సాధించారు. ముగ్గురు ఉద్యోగులతో మొదలైన మోదక్ ఎనలిటిక్స్ను నాలుగొందల యాభైమంది నిపుణుల పరివారంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డీప్ టెక్నాలజీ కంపెనీ ఇది. ఈమధ్యే జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ‘హైదరాబాద్ బిజినెస్ అవార్డు’ అందుకున్నారు ఆర్తి.
అరవై పైచిలుకు ఎంట్రీల నుంచి మోదక్ను ఏరికోరి ఎంపిక చేసింది నిపుణుల బృందం. ‘మా సంస్థలోని డేటా ఇంజినీర్లలో ముప్పై శాతం మహిళలే. ఆ ప్రకారంగా ఇది నా విజయమే కాదు, మహిళలందరి విజయం. ప్రతి స్త్రీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ భిన్నత్వమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అంటారు ఆర్తి. వివిధ కంపెనీలు తమ దగ్గరున్న డేటాను సమర్థంగా వాడుకునేందుకు మోదక్ సహకరిస్తుంది. ఆర్తి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకున్నారు. టెక్నాలజీపైనా పట్టు సాధించారు. ఈ రెండు అర్హతలే ఆమెను విజేతగా నిలబెట్టాయి.