కొండగట్టులో వైభవంగా హనుమాన్ చాలీసా పఠనం
పదివేల ఆలయాల్లో స్వచ్ఛందంగా కార్యక్రమం
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల, మార్చి 17 (నమస్తే తెలంగాణ): శాంతి, సుభిక్షాల కోసమే అఖండ హనుమాన్ చాలీసా పారాయ ణం, రామకోటి స్తూప ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో అఖం డ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామిజీతో కలిసి కవిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విశ్వమానవ కల్యాణం, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సౌభాగ్యం కోసం తెలంగాణవాసుల కొంగు బంగారమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ద్విమండల కాలంపాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించామని తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం, రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించుకోవడంతోపాటు 11 కోట్ల రామకోటి ప్రతులను రాయాలన్న మహాసంకల్పాన్ని తీసుకున్నప్పుడే అంజన్నపై భారం వేశామని చెప్పారు. కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో పారాయణం జరుగుతుందని తెలిపారు.
పారాయణం చేసే భక్తులకు భోజనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నిత్యం కొండగట్టు నుంచి పారాయణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ముందుకొచ్చిన భక్తి చానళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని పదివేల ఆలయాల్లోని స్వామి భక్తులు నిత్యం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్య పారాయణం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు. 23 అడుగుల ఎత్తుతో రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. రూ.90 లక్షలు మంజూరయ్యాయని, జూన్ 4న 11 కోట్ల రామకోటి ప్రతులతో స్తూపాన్ని వైభవంగా ప్రతిష్ఠించుకోనున్నట్టు వెల్లడించారు.
ఆధ్యాత్మికంగానూ గొప్పగా..: దుర్గా ప్రసాద్ స్వామిజీ
అఖండ హనుమాన్చాలీసా, రామకోటి స్తూప ఆవిష్కరణ మహత్తర కార్యక్రమమని అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్షాపీఠం పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామిజీ చెప్పారు. తెలంగాణ అన్ని రంగాలతోపాటు ఆధ్యాత్మిక రంగంలోనూ గొప్పగా పురోగమిస్తున్నదని కొనియాడారు. చావు వరకు వెళ్లి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ రాష్ర్టానికి మహాత్ముడని అభివర్ణించారు.