వనపర్తి : 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయం. అందుకే కొత్త జోన్లు, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం అయ్యాయని అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పాత వ్యవసాయ మార్కెట్లో రూ.5 కోట్లతో చేపట్టనున్న టౌన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సింగిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ఆంధ్రోళ్లకు 20 శాతం ఉద్యోగాలు దక్కాలనే కొంతమంది నోటిఫికేషన్ల కోసం రాద్ధాంతం చేశారు. యువత వారి మాటలు నమ్మి మోసపోవద్దు. వారి మాటల వెనక అంతరార్ధాన్ని గమనించాలన్నారు. గురి చూసి కొట్టాలి. లక్ష్యాన్ని సాధించాలని నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగ ప్రయత్నంలో ఎప్పుడూ నిరుత్సాహపడొద్దు. ఒకటి రాకుంటే మరొక దాని కోసం ప్రయత్నించాలి.
కానిస్టేబుల్ ఉద్యోగం సాధించలేకపోయిన వాళ్లు .. డీఎస్పీ ఉద్యోగం సాధించిన సంఘటనలు ఉన్నాయని యువతలో స్ఫూర్తిని నింపారు. నిజామ ాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. బాగా చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. యువత ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వనపర్తి జిల్లా కేంద్రాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుకుందాం. పట్టణంలో ప్రతి చోటా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ప్రజలందరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.