సూర్యాపేట, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా దీక్షలు చేస్తున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క గింజ ధాన్యం కూడా సేకరించబోమని కేంద్ర సంస్థ ఎఫ్సీఐ తెగేసి చెప్పిందని, ఇక్కడి బీజేపీ నేతలకు దమ్ముంటే ధాన్యం సేకరణపై ప్రధానితోనో, కేంద్ర మంత్రులతోనో సానుకూల ప్రకటన చేయించాలని డిమాండ్చేశారు. యాసంగి పంటలు, వానకాలం ధాన్యం కొనుగోళ్లపై గురువారం సూర్యాపేటలో సమీక్ష నిర్వహించిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఎంత ధాన్యం సేకరిస్తారో ముందే చెప్తే, అంతే పండించాలని రైతులకు చెప్తామని ప్రకటించారు. ‘రైతులను గాలికి వదిలేయాలని ఓ కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు. ఇంకోడు దీక్ష పేరుతో గంటసేపు దొంగదీక్ష చేస్తాడు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏరోజైనా ఈ పార్టీలు రైతుల గురించి ఆలోచించాయా?’ అని ధ్వజమెత్తారు. రాబోయే ప్రమాదాన్ని రైతులకు ముందే చెప్పడం తమ బాధ్యతగా భావించి సాగుపై సూచనలు చేస్తున్నామని స్పష్టంచేశారు. క్షుద్ర రాజకీయాల కోసం రైతాంగం ఉసురు తీయవద్దని హితవు పలికారు.