హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నదని, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. నెలవారీ సమీక్షలో భాగంగా ఆదివారం ఆయన ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం, ల్యాబ్స్ పనితీరు, సాధించిన పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార కల్తీని అడ్డుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
రూ.2.4 కోట్లతో అధునాతన ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వాహనాలు నాలుగింటిని సమకూర్చుకున్నామని పేర్కొన్నారు. ఐపీఎంలో రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో ఆధునీకరించిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అన్ని మొబైల్ వాహనాలు పనిచేయాలని, టాస్ఫోర్స్ బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. అధికారులు ఓవైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీ ఆహారం పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎకడైనా కల్తీ జరిగినట్టు, ఆహారం నాణ్యత లేనట్టు గుర్తిస్తే టోల్ ఫ్రీ నంబర్ 040-21111111 కు ఫోన్ చేయాలని లేదా ట్విట్టర్ ద్వారా @AFCGHMCలో ఫిర్యాదు చేయాలని మంత్రి హరీశ్రావు ప్రజలను కోరారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పెంచాలని, క్యాంపుల ద్వారా రక్తం సేకరించాలని అధికారులకు సూచించారు. ఏరియా దవాఖానలకు అవసరమైన రక్తం సరఫరా చేయాలని, తలసేమియా బాధితులకు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల, అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.