Rohit Sharma : ఐపీఎల్ 17వ సీజన్లో రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీ లేకుండా ఆడుతున్నాడు. మినీ వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను కొన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ అతడికే పగ్గాలు అప్పగించింది. దాంతో, ముంబై మేనేజ్మెంట్తో పాటు పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తేలిసిందే. ఈ నేపథ్యంలో హిట్మ్యాన్ 2025 మెగా వేలంలో పాల్గొంటాడనే వార్తలు వినిపించాయి. ఆ వదంతులకు బలం చేకూర్చేలా ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్(Michael Vaughan) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
యూట్యూబర్ రణ్వీర్ అల్లహ్బడియా(Ranveer Allahbadia) షోలో పాల్గొన్న వాన్ మాట్లాడుతూ.. రోహిత్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఆడుతాడని తెలిపాడు. ‘రోహిత్ చెన్నైకి మారుతాడు. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్ చెన్నై కెప్టెన్గా కొనసాగుతున్నాడు. పద్దెనిమిదవ సీజన్లో ఇదంతా జరుగుతుందని నేను భావిస్తున్నా’ అని వాన్ వెల్లడించాడు.
అంతేకాదు ముంబై ఫ్రాంచైజీ పెద్ద తప్పు చేసిందని ఈ మాజీ క్రికెటర్ అన్నాడు. ‘హార్దిక్ను కెప్టెన్గా ప్రకటించి ముంబై పెద్ద పొరపాటు చేసింది. ఎందుకంటే రోహిత్ వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో టీమిండియాను ఫైనల్కు తీసుకెళ్లాడు. టీ20 ప్రపంచకప్లోనూ అతడు భారత సారథిగా ఎంపికయ్యాడు. అందుకనే ఈ ఏడాది కాకుండా మరో రెండు ఏండ్లకు పాండ్యాకు ముంబై కెప్టెన్నీ అప్పగిస్తే బాగుండేది’ అని వాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ సారథ్యంలో ముంబై ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచింది. 2013, 2015, 2017, 2019, 2020 ల్లో విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.