జైపూర్: కొందరు దుండగులు బస్సులోకి చొరబడ్డారు. నిందితులకు ఎస్కార్ట్గా ఉన్న పోలీసుల కళ్లలో కారం చల్లారు. ఆ తర్వాత నిందితులపై గన్తో కాల్పులు జరిపారు. ఒక గ్యాంగ్స్టర్ (gangster shot dead) మరణించగా మరో నిందితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్లోని భరత్పూర్లో ఈ సంఘటన జరిగింది. 2022 సెప్టెంబరు 4న భూవివాదం నేపథ్యంలో బీజేపీ నేత కృపాల్ జఘీనాను కొందరు దుండగులు భరత్పూర్లో హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుల్దీప్ జఘీనా, మరో నలుగురిని గత ఏడాది సెప్టెంబర్ 11న మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, బుధవారం ఉదయం నిందితులు కుల్దీప్ జఘీనా, మరో నిందితుడు విజయ్పాల్ను సాయుధ పోలీసులు జైపూర్ జైలు నుంచి భరత్పూర్ కోర్టుకు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నారు. హలెనా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమోలి టోల్ ప్లాజా వద్ద ఆ బస్సు ఆగింది. ఇంతలో కారు, రెండు బైక్లపై సుమారు 8 మంది అక్కడకు వచ్చారు. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులోకి వారు ఎక్కారు. నిందితులకు ఎస్కార్ట్గా ఉన్న సాయుధ పోలీసుల కళ్లలో కారం చల్లారు. కుల్దీప్, విజయ్పాల్పై తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గ్యాంగ్స్టర్ కుల్దీప్ జఘీనా బస్సులోనే మరణించాడు. తీవ్రంగా గాయపడిన మరో నిందితుడు విజయ్పాల్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బీజేపీ నేత కృపాల్ జఘీనా హత్యకు ప్రతీకారంగా ప్రధాన నిందితుడు కుల్దీప్ జఘీనాను దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో ఇతర ప్రయాణికులు ఉండటంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరుపలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు సమీప జిల్లాల పోలీసులు, చెక్పోస్ట్లను అలెర్ట్ చేసినట్లు వెల్లడించారు.