హైదరాబాద్, డిసెంబర్ 7: మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 13న రానున్నది. షేర్ ధరల శ్రేణిని రూ.780-796గా మంగళవారం నిర్ణయించారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా ఈ హైదరాబాదీ ఫార్మసీ రిటైల్ సంస్థ రూ.1,398 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ పబ్లిక్ ఇష్యూ.. ఈ నెల 15న ముగుస్తుంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ 10నే మొదలవుతుంది. కాగా, ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూయె న్స్ విలువ రూ.600 కోట్లుగా ఉంటే, ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్ల ద్వారా రూ.798.30 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కు తీసుకువస్తున్నారు. నిజానికి ఓఎఫ్ఎస్ పరిమాణాన్ని తొలుత రూ.1,038.71 కోట్లుగా నిర్ణయించారు. అయితే తిరిగి రూ.798.30 కోట్లకు తగ్గించారు. ఇదిలావుంటే రూ.5 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం రిజర్వ్ చేశారు.
షేర్ తుది ఇష్యూ ధరపై వీరికి రూ.78 రాయితీ లభిస్తుంది. ఒక్కో ఇన్వెస్టర్ కనీసం 18 ఈక్విటీ షేర్లనైనా కొనాల్సి ఉంటుంది. మెడ్ప్లస్ అనుబంధ సంస్థ ఆప్టివల్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఈ షేర్లను నమోదు చే యనున్నారు. మెడ్ప్లస్ను 2006లో ప్రారంభించారు. సంస్థ ప్రస్తుత ఎండీ, సీఈవోగా ఉన్న గంగడి మధుకర్రెడ్డి దీన్ని స్థాపించారు. ‘అమ్మకాలు, స్టోర్ల విస్తరణపైనే సంస్థ వృద్ధి ఆధారపడి ఉన్నది. గతేడాది 350 స్టోర్లను కొత్తగా తెచ్చాం. ఈ ఏడాది 700 స్టోర్లను తెస్తున్నాం’ అని మధుకర్రెడ్డి అన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, బెంగాల్లో సంస్థకు 2వేలకుపైగా స్టోర్లున్నట్లు తేలింది.
10న మెట్రో బ్రాండ్స్ ఐపీవో
పాదరక్షల రిటైల్ సంస్థ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్.. ఈ నెల 10న ఐపీవోకు వస్తున్నది. షేర్ ధరల శ్రేణిని రూ.485-500లుగా మంగళవారం నిర్ణయించారు. ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలాకు పెట్టుబడులున్న ఈ సంస్థ.. తాజా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,367.5 కోట్లను సేకరించనున్నది. ఐదు రోజులపాటు జరిగే ఈ ఐపీవో 14న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 9న మొదలవుతుంది.
ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూయెన్స్ విలువ రూ.295 కోట్లుగా ఉంటే.. ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన 2.14 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి తెస్తున్నారు. సంస్థలో ఇది దాదాపు 10 శాతం వాటాకు సమానం. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్నకు 84 శాతం వాటా ఉన్నది. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 598 మెట్రో బ్రాండ్స్ స్టోర్లున్నాయి. ఇందులో 211 స్టోర్లను గడిచిన మూడేండ్లలోనే తెరిచారు. ఇక ఈ ఐపీవోలో పాల్గొనాలనుకునే ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లనైనా కొనాల్సి ఉంటుంది.