‘నటుడిగా కొత్త తరహా సినిమాలు నేను చేయడం లేదనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచే చిత్రమిది. సక్సెస్లు, బడ్జెట్ లాంటి పారామీటర్స్ను పక్కనపెట్టి కథను నమ్మి నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించా’ అని అన్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో మంచు విష్ణు చెప్పిన సంగతులివి…
నా మార్కెట్కు మించి ఖర్చు చేసిన సినిమా అని ప్రచార వేడుకల్లో అన్నారెందుకు?
కథపై ఉన్న నమ్మకంతో నా మార్కెట్ విలువకు రెట్టింపు ఈ సినిమా కోసం ఖర్చు చేశా. నేను దాచుకున్నదంతా సినిమాపై పెట్టా. ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా స్వీకరిస్తారో అనే భయం నాలో చాలా ఉంది. న చ్చిన కథ దొరికింది కాబట్టి డబ్బు విషయంలో కాంప్రమైజ్ కాలేదు.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే పాటలు, డ్యాన్సులు ఇందులో ఉండవు. ఇద్దరు అక్కాతమ్ముళ్లు బస్తీలో ఉంటూ అమెరికాలో వేల కోట్ల స్కామ్ ఎలా చేశారు? డబ్బు సంపాదించాలనే వారి అత్యాశ వలన అమాయకులు ఏ విధంగా బలయ్యారు? చట్టానికి దొరక్కుండా వారు ఆ నేరం నుంచి ఏ విధంగా తప్పించుకున్నారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
అక్క పాత్ర కోసం కాజల్ అగర్వాల్ను తీసుకోవాలనే ఆలోచన ఎందుకొచ్చింది?
సోదరి క్యారెక్టర్ కోసం తొలుత ప్రీతిజింతాను కలిశాం. నెగెటివ్ షేడ్స్తో కూడిన పాత్ర చేయడానికి ఆమె భయపడ్డారు. కాజల్ మాత్రం చాలా సవాల్గా భావించి ఈ సినిమా అంగీకరించింది. యథార్థంగా జరిగిన కథ ఇది. మీడియాలో ఈ స్కామ్ గురించి చాలా కథనాలు వచ్చాయి. ఈ స్కామ్ చేసిన అక్కాతమ్ముళ్లు నిజంగానే ఉన్నారు. వారిని నేను కలవలేదు. వారు చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలపై పరిశోధన చేసి సినిమాను తెరకెక్కించాం.
హీరో, నిర్మాతగానే కాకుండా కథారచనలో మీరు భాగమయ్యారని విన్నాం?
ఈ కథ తొలి డ్రాఫ్ట్ నేనే రాశా. 90 శాతం వాస్తవాల్ని ఇందులో చూపించాం. డాక్యుమెంటరీ ఫీల్ కలగకుండా ఉండాలనే పదిశాతం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. యూనివర్సల్ కథ ఇది. అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతుందనే ఆలోచనతో ఐదు భాషల్లో విడుదలచేస్తున్నాం.
టెక్నికల్ అంశాలతో కూడిన ఈ కథను సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
తొలుత ఈ సినిమా రషెస్ను నాన్నకు చూపించా. టెక్నాలజీ పరమైన అంశాల విషయంలో ఆయన కొన్ని అనుమానాల్ని వ్యక్తంచేశారు. నాన్న మాదిరిగా డార్క్నెట్, ఐఆర్ఎస్ లాంటి టెక్నికల్ పదాల విషయంలో కామన్ ఆడియెన్స్ తికమకపడకూడదనే అందరికీ అర్థమయ్యేలా కొన్ని సన్నివేశాల్ని సినిమాకు జోడించాం.
ఈ సినిమా నుంచి మీరు నేర్చుకున్నదేమిటి?
ఈ సినిమా ప్రయాణంలో నాన్నతో పాటు నా భార్య విరోనికా నాకు అండగా నిలిచారు. సినిమా బడ్జెట్ ఎక్కువైందనే భయం నాకంటే వాళ్లలోనే ఎక్కువగా ఉంది. కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాననే ఆలోచనతో చాలా సార్లు నాపై నాకే కోపం వచ్చింది. కానీ రిస్క్ తీసుకోకపోతే జీవితానికి అర్థం లేదనిపించింది.
‘ఢీ’ సీక్వెల్ ఎప్పుడూ మొదలుకాబోతుంది?
శ్రీనువైట్లతో చేయబోతున్న ‘ఢీ అండ్ ఢీ’ ఏప్రిల్ రెండోవారంలో మొదలుకానుంది. ‘ఢీ’కి సీక్వెల్ కాదిది. కొత్త కథలో ఈ సినిమా చేస్తున్నాం.