పెరిగిన మందుబస్తాల ధరలు
జిల్లాలో ఏటా 1,13,300 మెట్రిక్ టన్నుల వినియోగం
ఆదిలాబాద్, మార్చి 27 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇందు లో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రపంచ వ్యా ప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఓ వైపు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దూ చేయాలంటూ ఇప్పటికే రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తాజాగా ఎరువుల తయారీ కంపెనీలు ధరలను పెంచడంతో రైతులపై మరింత భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ కారణంగా ఇబ్బందులు పడుతున్నా రు. జిల్లాలో ఏటా వానకాలంలో 87,600 మెట్రిక్ ట న్నులు, యాసంగిలో 26,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. ఇప్పుడు ఎరువుల ధరలు పిరం కా నుండడంతో అన్నదాతలు మరింత నష్టపోవాల్సి వస్తుంది.
భారీగా పెరిగిన ధరలు
కేంద్ర ప్రభుత్వం కేవలం యూరియా ధరల నియంత్రణను తన వద్ద ఉంచుకుని మిగతా ఎరువుల ధరల నిర్ణయాన్ని తయారీ కంపెనీలకు వదిలేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, తగ్గుదలను అనసరించి కంపెనీలు ఎరువుల ధరలను నిర్దేశిస్తాయి. ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రకారం రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. డీఏపీ బస్తాకు రూ.200, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సంచికి రూ.150, కాంప్లెక్స్ ఎరువులకు బస్తాకు పోషకాలకు అనుగుణంగా రూ. 200 నుంచి రూ. 320 వరకు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులకు భారీగా ఎరువుల భారం పడనుంది. యేటా వానకాలంలో ఎరువుల విక్రయాలు ఏప్రిల్ నుంచే ప్రారంభకానుండగా అప్పటినుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. కేంద్ర ఎరువుల ధరలపై నియంత్రణ తప్పుకోవడంతో కంపెనీలు మందుబస్తాల రేట్లు పెంచుతున్నాయని దీంతో తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.