నర్సంపేట/ఖానాపురం/నల్లబెల్లి, ఏప్రిల్ 20: తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. శనివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం మండలకేంద్రాల్లో మానుకోట పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకుందన్నారు. కానీ వంద రోజుల్లోనే ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత మొదలైందన్నారు. మహబూబాబాద్ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహిస్తామని చెప్పి.. కేవలం ఐదు వేల మందితో సభ జరిగిందని ఎద్దేవా చేశారు. సభకు జనాలు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ స్వయంగా రోడ్లపై ఉన్న ప్రజలను సభాస్థలికి తీసుకెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ కష్టాలొస్తాయన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తీసుకొచ్చిన పనులన్నీ పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే దొంతికి ఈ టర్మ్ సరిపోదని విమర్శించారు. కాంగ్రెస్ పాలన ఇలాగే ఉంటే ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మధ్య సఖ్యత లేదనే విషయం మహబూబాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభతో ప్రజలకు తెలిసిపోయిందని, ఎమ్మెల్యే దరఖాస్తులు గిర్నిబావి కూడా దాటడం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. మానుకోట బహిరంగ సభతోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన ‘ఖేల్ ఖతం.. దుకాణం బంద్’ అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఆయాచోట్ల సమావేశాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, వరంగల్ జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ కోమలా భద్రయ్య, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ ప్రకాశ్రావు, మండల అధ్యక్షులు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, బానోత్ సారంగపాణి, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, బత్తిని శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.