మహబూబ్నగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు వెయ్యేండ్ల చరిత్ర ఉన్నదని, ఆనాటి చరిత్రకు ఇక్కడి శిల్పాలే సజీవ సాక్ష్యమని రాష్ట్ర పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు కందూరు చోళుల రాజధాని కోడూరులోని చారిత్రక ఆనవాళ్లను శనివారం ఆయన సందర్శించారు. వరద రాజుల స్వామి దేవాలయం వద్ద ఉన్న నాగదేవత శిల్పాలు, శిథిల శివాలయం వద్ద ఉన్న వీరుల శిల్పాలు, సతీ శిల్పాలు, కోట బురుజులు, గుండాన్ని ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఆ శిల్పాలు కందూరు చోళుల కాలానివని తెలిపారు. ఈ చారిత్రక సంపద 1100 వందల ఏండ్ల నాటిదన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాలను పరిరక్షించుకోవాలని సర్పంచ్ శ్రీకాంత్గౌడ్ను ఆయన విజ్ఞప్తి చేశారు. వెయ్యేండ్ల చరిత్ర గల కోడూరులోని శిల్పాలు, కోట బురుజులు, తదితర ఆనవాళ్లపై ఒక పుస్తకం తీసుకురావాలని కోడూరు గ్రామానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి.రాజేశ్వర్గౌడ్ కోరారు. వారివెంట సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ నర్సింహులు, మన్యంకొండ పాలక మండలి సభ్యులు చిన్నయ్య గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణయ్యగౌడ్, వార్డు సభ్యులు రమేశ్గౌడ్, శేఖర్, చిన్న నాగన్నగౌడ్, గ్రామస్తులు రాములుగౌడ్, వెంకటయ్య ఉన్నారు.
భైరవ శిల్పాన్ని పరిరక్షించాలి
బిజినేపల్లి, అక్టోబరు 23: రాష్ట్ర కూటుల కాలానికి చెందిన భైరవ శిల్పాన్ని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వడ్డెమాన్ గ్రామ శివారులో 1100ఏండ్ల భైరవ విగ్రహం నడుము దాకా భూమిలో కూరుకుపోయిందన్నారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఈ విగ్రహాన్ని సందర్శించామన్నారు. విగ్రహాన్ని బయటకు తీసి గ్రామానికి తరలించి పీఠంపై నిలబెట్టి చారిత్రక వివరాల పేరున శిలాఫలాకాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దినకర్, సుబ్బయ్య, వెంకట్రెడ్డి, ఎల్లయ్య ఉన్నారు.