న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుపమా చౌహాన్తో కలిసి ఆయన ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వచ్చారు. భారత రెండవ సీడీఎస్గా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఆయనకు గౌరవ వందనం లభించింది. భారత సైనిక దళాల్లో అత్యధిక ర్యాంకు దక్కడం గర్వంగా ఉందని అనిల్ అన్నారు. త్రివిధ దళాల ఆశయాలకు తగినట్లుగా పనిచేయనున్నట్లు సీడీఎస్ అనిల్ చెప్పారు. అన్ని సవాళ్లను, అవరోధాలను కలిసికట్టుగా ఎదుర్కోనున్నట్లు ఆయన వెల్లడించారు.
జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు.. అనిల్ చౌహాన్ను ఎంపిక చేసినట్టు బుధవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రక్షణశాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్ వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గత ఏడాది మేలో ఈస్టర్న్ కమాండర్గా పదవీ విరమణ చేసిన లెఫ్ట్నెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (61).. 40 ఏండ్ల సర్వీసులో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. రెండవ సీడీఎస్గా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు.