న్యూఢిల్లీ, అక్టోబర్ 25: వృద్ధులు, మహిళల కోసం రైళ్లలో లోయర్ బెర్త్ టికెట్ బుక్ చేసుకొన్నప్పటికీ బెర్తులు కేటాయించడం లేదంటూ వస్తున్న విమర్శలపై భారత రైల్వే వివరణ ఇచ్చింది. లోయర్ బెర్తు టికెట్లు 60 ఏండ్లు పైబడిన పురుషులు, 45 ఏండ్లు పైబడిన స్త్రీలకు మాత్రమే కేటాయిస్తారని తెలిపింది. ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ ఒకే టికెట్ మీద ప్రయాణిస్తే అప్పుడు వారికి లోయర్ బెర్త్ కన్ఫమ్ అవుతుందని పేర్కొన్నది. ఒక వేళ ఇద్దరు కంటే ఎక్కువ సీనియర్ సిటిజన్లు ఉన్నా లేదా ఒకరు సీనియర్ సిటిజన్, మరొకరు కాకపోయినా వారికి లోయర్ బెర్త్ కేటాయించరని వివరించింది. ముగ్గురు సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్తులు బుక్ చేసుకొంటే ఒకటి మాత్రమే కేటాయించారంటూ ఇటీవల జితేంద్ర అనే వ్యక్తి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రైల్వే వివరణ ఇచ్చింది.