ప్రేమించి పెండ్లి చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత.. గొడవ పడుతున్నారు.. పెద్దలు సర్థిచెప్పినా వారిలో మార్పు రాలేదు.. మద్యం తాగిన తర్వాత టవల్తో భార్య గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. పార్థీబస్తీలో నివాసముండే శకత్వాల దర్శన్ కూరగాయల వ్యాపారి. ఈసీఐఎల్లో కూరగాయలు అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో సౌందర్యను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. దంపతులిద్దరికీ రోజూ కలిసి మద్యం సేవించే అలవాటు ఉన్నది.
కొంతకాలంగా వారిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దర్శన్.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని భావించాడు. కానీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో తిరిగి కలిసి జీవనం సాగిస్తున్నారు. అనంతరం గత వారం రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన భార్యను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం తెల్ల టవల్తో భార్య గొంతు బిగించి, హతమార్చాడు. అనంతరం టవల్తో పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.