ముంబై, నవంబర్ 16: రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా దెబ్బకు డీలాపడిన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇన్నాళ్లూ రెపో, రివర్స్ రెపో రేట్లను పెద్ద ఎత్తున ఆర్బీఐ తగ్గిస్తూపోయిన విషయం తెలిసిందే. గతకొద్ది ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లోనైతే వాటి జోలికీ వెళ్లని సంగతీ విదితమే. కేవలం ఇతర పాలసీ నిర్ణయాలకే ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ పరిమితమైంది. అయితే ఇకపై వడ్డీరేట్ల పెంపుపై కేంద్ర బ్యాంక్ దృష్టి పెడుతుందన్న అంచనాలను మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెల జరిగే ద్రవ్యసమీక్షలో తొలుత రివర్స్ రెపో రేటును పెంచే వీలుందన్న మోర్గాన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు ఉపాసన, గంభీర్లు.. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిపే ద్రవ్యసమీక్షలో రెపో రేటును పెంచవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ నిర్దేశించుకున్న 2-6 శాతం శ్రేణిలోనే ఉండటంతో డిసెంబర్ ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్ల పెంపునకు ఆర్బీఐ శ్రీకారం చుడుతుందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం, దేశంలో కొవిడ్-19 కేసులు తగ్గుతూ.. వ్యాక్సినేషన్ పెరుగుతూ ఉండటం కూడా ఆర్బీఐ వడ్డింపులకు ఓ కారణంగానే వారు అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ కనీసం 7.8 శాతంగా, గరిష్ఠం 8.6 శాతంగా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఆపై ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతం, 7.9 శాతానికి పడిపోవచ్చని పేర్కొంటున్నారు.
క్రిప్టో కరెన్సీతో ప్రమాదమే
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ దాస్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చలో దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దని, నియంత్రణ చాలన్న అభిప్రాయాలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలతో లోతైన సమస్యలున్నాయని మంగళవారం దాస్ పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక సుస్థిరతకు క్రిప్టో కరెన్సీలు ముప్పేనని వ్యాఖ్యానించారు. దీంతో కేవలం వారం రోజుల్లో దాస్ క్రిప్టో కరెన్సీలపై రెండుసార్లు బలమైన వ్యతిరేకతను ప్రదర్శించడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై భారీగా లాభాలు వస్తున్నాయన్న తప్పుడు ప్రచారం మధ్య ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ అంశంపై సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టో కరెన్సీలపై బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోవాలి: దాస్
దేశ ఆర్థిక వృద్ధిరేటు పరుగులు మందగించాయని, ఆగిపోయాయన్న అంచనాల మధ్య ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అప్పుడే వృద్ధిరేటు సుస్థిరత సాధ్యమని అభిప్రాయపడ్డారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎస్బీఐ కార్యక్రమంలో దాస్ మాట్లాడుతూ.. ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఊపందుకుంటే ఆకర్షణీయ జీడీపీ గణాంకాలుంటాయన్నారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను చాలా రేటింగ్ ఏజెన్సీలు భారత జీడీపీ అంచనాలను ఇటీవలికాలంలో తగ్గిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ ఆర్బీఐ మాత్రం గతంలో వేసిన 9.5 శాతం వద్దే ఉన్నది. కాగా, బ్యాంకులు తమ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రాసెస్ను మెరుగుపర్చుకోవాలని దాస్ ఈ సందర్భంగా సూచించారు. బ్యాంకుల వ్యాపార విధానాలు, వ్యూహాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. దేశీయ స్టార్టప్లు విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయని, వాటి పనితీరు బాగుందని ప్రశంసించారు.