Stock Market | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనైనా లాభాలనే అందుకున్నాయి. మదుపరులు అంతకుముందు వారంలాగే అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు. అయితే చివరకు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో సూచీలు ఆల్టైమ్ హైల్లో స్థిరపడ్డాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 299.41 పాయింట్లు పెరిగి 76,992.77 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 175.45 పాయింట్లు అందిపుచ్చుకుని 23,465.60 దగ్గర నిలిచింది. ఈ వారం సైతం సూచీలు ఓవరాల్గా లాభాల్లోనే కదలాడవచ్చన్న అంచనాలున్నాయి. లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడినా.. చివరకు ఓ మోస్తరు వృద్ధినే చూస్తాయన్న అభిప్రాయాలు మెజారిటీ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ సూచీలు జీవనకాల గరిష్ఠాల వద్దనుండటంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగే అవకాశాలూ ఉన్నాయి. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 23,200 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 23,600-23,800 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.