సూర్యాపేట, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని గుర్రంబోడు తండాకు చెందిన 129 మంది రైతుల కబ్జాలో ఉన్న 120.16 ఎకరాల భూమి వారికే చెందనుంది. ఈ భూములపై గ్లేడ్ ఆగ్రో బయోటెక్కు ఉన్న మ్యుటేషన్ను రద్దు చేస్తున్నట్లు తెలిసింది. అసైన్డ్ కమిటీ నిబంధనల ప్రకారం అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆ మండల తాసీల్దార్కు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గ్లేడ్ సంస్థ తమ ఆధీనంలో 316.24 ఎకరాలు ఉన్నాయని చెప్తుండగా.. అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం ఆ భూమిలో 9 ఎకరాలు వేరే గ్రామానికి చెందిన సర్వే నంబర్లలో ఉన్నట్టు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకోబోతుండగా 92.15 ఎకరాలకు సంబంధించిన రికార్డుల్లో తేడాలు బయటపడ్డాయి. దీంతో సంస్థకు చెందిన భూముల రికార్డులపై మరోసారి పూర్తిస్థాయి పునర్విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గెలిచిన వెంటనే కబ్జాలో ఉన్న రైతులకే భూములు చెందుతాయని చేసిన వాదన అధికారికంగా నెగ్గింది. ఏండ్ల తరబడి వివాదాలున్న ఈ భూములకు పరిష్కారం చూపేందుకు మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే సైదిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సర్వే చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు భూములిచ్చే ఘనత ప్రభుత్వానికి దక్కకూడదన్న అక్కసుతోనే కొందరు నాయకులు గుర్రంబోడు భూముల అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించారని స్థానికులు విమర్శిస్తున్నారు.